
టెహ్రాన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ -ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ జరిగిందని ప్రకటించిన కొద్దిపేపటికే టెహ్రాన్ దానిని ఖండించింది. దీనిపై ఎటువంటి ఒప్పందం కుదరలేదని పేర్కొంది. అయితే తమ సైనిక కార్యకలాపాల విరమణపై తుది నిర్ణయం తరువాత తీసుకుంటామని ఇరాన్ విదేశాంగ మంత్రి అరఘ్చి పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు చూస్తుంటే ఇరాన్ సంధి దిశగా మొగ్గుచూపుతున్నదనే సంకేతాలు కనిపిస్తున్నాయిని విశ్లేషకులు అంటున్నారు.
ఇరాన్ మంత్రి అరఘ్చి ఒక ప్రత్యేక పోస్ట్లో ఇజ్రాయెల్పై టెహ్రాన్ తన సైనిక కార్యకలాపాలను ముగించిందని అన్నారు. ఇజ్రాయెల్ దురాక్రమణను ఢీకొడుతూ తమ శక్తివంతమైన సాయుధ దళాల సైనిక కార్యకలాపాలు చివరి నిమిషం వరకు, అంటే ఉదయం 4 గంటల వరకు కొనసాగాయన్నారు. ఇరానియన్లందరితో కలిసి, దేశాన్ని రక్షించుకునేందుకు సైన్యం చివరి వరకూ పోరాడిందని, శత్రువుల దాడిని చివరి నిమిషం వరకు తిప్పికొట్టిన దళాలకు కృతజ్ఞతలు చెబుతున్నానని ఆయన పేర్కొన్నారు.
ట్రంప్ తాజాగా 12 రోజుల ఘర్షణల అనంతరం ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య సంపూర్ణ కాల్పుల విరమణ జరిగిందని ప్రకటించారు. ఈ కాల్పుల విరమణ ఉదయం 9:30 (ఐఎస్టీ) నుండి ప్రారంభమై 24 గంటల పాటు దశల వారీ ప్రక్రియగా ఉంటుందని, ఇరాన్ ఏకపక్షంగా అన్ని కార్యకలాపాలను నిలిపివేస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. 12 గంటల తర్వాత ఇజ్రాయెల్ కూడా అదే బాటలో నడుస్తుందని ప్రకటించారు. అయితే ఇజ్రాయెల్ ఇంకా ఈ కాల్పుల విరమణ వాదనలపై స్పందించలేదు. ఇరాన్కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్తో జతకట్టిన అమెరికా.. ఇరాన్లోని మూడు కీలక అణు కేంద్రాలను ధ్వంసం చేసిన దరిమిలా ఈ యుద్ధంలో వేగవంతమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి.
ఇది కూడా చదవండి: ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటనపై ఇరాన్ ఆగ్రహం