
ఇరాన్ అమ్ములపొదిలో కీలక అస్త్రం
2,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే ఆయుధం
ఇరాన్లోని మూడు కీలక అణు కేంద్రాలపై అమెరికా సైన్యం బంకర్ బస్టర్ బాంబులు, క్షిపణులు ప్రయోగించిన కొన్ని గంటల వ్యవధిలోనే ఇరాన్ సైన్యం ఇజ్రాయెల్పై దాడులకు దిగింది. ఖొర్రంషహర్–4 మిస్సైల్ సహా మొత్తం 40 క్షిపణులు ప్రయోగించినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్(ఐఆర్జీసీ)ప్రకటించింది. ఇజ్రాయెల్లోని లక్ష్యాలను ఛేదించామని వెల్లడించింది.
ఖొర్రంషహర్–4 క్షిపణి ప్రయోగ దృశ్యాలు ఇరాన్ ప్రభుత్వ టీవీ చానల్లో ప్రత్యక్షమయ్యాయి. ఇది ఇరాన్ అమ్ములపొదిలో అత్యంత కీలకమైన అస్త్రం అని చెప్పొచ్చు. ఇరాన్కు ఇదే అతిపెద్ద క్షిపణి కావడం గమనార్హం. ఇరాన్లోని ఖొర్రంçషహర్ అనే నగరం పేరునే దీనికి పెట్టారు. ఖైబర్ మిస్సైల్ అని కూడా అంటారు. 1980వ దశకంలో ఖొర్రంషహర్లో ఇరాక్–ఇరాన్ మధ్య భారీ యుద్ధం జరిగింది. ప్రస్తుతం సౌదీ అరేబియాలో ఉన్న యూదుల కోట ‘ఖేబర్’ను 7వ శతాబ్దంలో అప్పటి పర్షియా(ఇరాన్) పాలకులు అక్రమించారు.
→ ఖొర్రంషహర్–4ను ఇరాన్ ప్రభుత్వ రంగంలోని ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ ఆర్గనైజేషన్(ఏఐఓ) అభివృద్ధి చేసింది. ఇది ద్రవ ఇంధనంతో నడిచే మీడియం–రేంజ్ బాలిస్టిక్ క్షిపణి.
→ తొలిసారిగా 2017 జనవరిలో పరీక్షించారు. 2017 సెప్టెంబర్లో టెహ్రాన్ మిలటరీ పరేడ్లో ప్రజల కోసం మొదటిసారి బహిరంగంగా ప్రదర్శించారు.
→ ఈ క్షిపణి పొడవు 13 మీటర్లు. వ్యాసం 1.5 మీటర్లు. బరువు 19.5 టన్నులు. పరిధి 2,000 కిలోమీటర్లు. 1,800 కిలోల వార్హెడ్లను మోసుకెళ్లగలదు. కానీ, దీని పరిధి 2,500 కిలోమీటర్లకుపైగా ఉంటుందని కొందరు నిపుణులు చెబుతున్నారు. ఈజిప్టు, ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, రొమేనియా, బల్గేరియా, గ్రీస్ దేశాలు ఈ మిస్సైల్ పరిధిలోకి వస్తాయి.
→ ఖొర్రంషహర్–4 టార్గెట్ ఏరియాకు చేరుకున్న తర్వాత ఏకంగా 80 లక్ష్యాలపై అత్యంత కచ్చితత్వంతో దాడి చేయగలదని అంటున్నారు. అత్యంత వేగంతో ప్రయాణిస్తూ శత్రుదేశాల గగనతల రక్షణ వ్యవస్థల నుంచి సులువుగా తప్పించుకోగలదని సమాచారం. అంటే ఈ క్షిపణిని మధ్యలోనే కూలి్చవేయడం దాదాపు అసాధ్యమే. ఒక్కసారి గురిపెడితే లక్ష్యాన్ని తాకాల్సిందే.
→ ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థకు అసలైన ముప్పు ఖొర్రంషహర్–4 నుంచే పొంచి ఉంది. ఇజ్రాయెల్ ఐరన్డోమ్ కానీ, డేవిడ్ స్లింగ్ కానీ దీన్ని అడ్డుకోలేవు.
– సాక్షి, నేషనల్ డెస్క్