మన బ్రాండ్‌.. స్విచ్‌ ఆఫ్‌! | India Ranks Second In Mobile Phone Manufacturing After China, But Domestic Brands Struggle To Compete | Sakshi
Sakshi News home page

మన బ్రాండ్‌.. స్విచ్‌ ఆఫ్‌!

Dec 27 2025 3:45 AM | Updated on Dec 27 2025 1:27 PM

India ranks second in smartphone sales

భారత స్మార్ట్‌ఫోన్ల మార్కెట్లో విదేశీ కంపెనీలదే హవా 

చైనా దెబ్బకు కనుమరుగైన ఇండియన్‌ బ్రాండ్స్‌ 

ప్రపంచంలోనేరెండో అతిపెద్దవిపణిలోవిభిన్నపరిస్థితులు 

సాక్షి, స్పెషల్‌ డెస్క్ :  మొబైల్‌ ఫోన్ల తయారీలో చైనా తర్వాతి స్థానం భారత్‌దే. యూఎస్, యూఏఈ, నెదర్లాండ్స్, యూకే, ఆ్రస్టియా, ఇటలీ వంటి దేశాలకు మేడ్‌ ఇన్‌ ఇండియా ట్యాగ్‌తో ఐఫోన్లూ ఎగు­మతి అవుతున్నాయి. స్మార్ట్‌ఫోన్ల విక్రయాల్లో భారత్‌ రెండవ స్థానంలో ఉంది. ఏటా 15 కోట్లకుపైగా స్మార్ట్‌ఫోన్లు వినియోగదారుల చేతుల్లోకి వెళ్తున్నాయి. ఈ స్థాయిలో అమ్మకాలు జరుగుతున్నా ఇండియన్‌ బ్రాండ్స్‌ కనిపించకపోవడం గమనార్హం. 

మైక్రోమ్యాక్స్‌ వంటి దేశీ బ్రాండ్స్‌ వచ్చినా.. 
భారత మొబైల్‌ ఫోన్ల విపణిలో 2010కి ముందు వరకు నోకియా (ఫిన్లాండ్‌), మోటరోలా (యూఎస్‌), ఎరిక్సన్‌ (స్వీడన్‌), సీమెన్స్‌ (జర్మనీ), సామ్‌సంగ్‌ (దక్షిణ కొరియా), సోనీ ఎరిక్సన్‌ (జపాన్‌/స్వీడన్‌), బ్లాక్‌బెర్రీ (కెనడా), ఎల్‌జీ (దక్షిణ కొరియా) కంపెనీలు రాజ్యమేలాయి. 2003లో చెన్నైకి చెందిన వీకే మునోత్‌తోపాటు పలు కంపెనీలు ఎంట్రీ ఇచ్చినప్పటికీ పెద్దగా రాణించలేదు. 

కానీ 2008లో మైక్రోమ్యాక్స్‌ రాకతో భారతీయ చవక హ్యాండ్‌సెట్స్‌ యుద్ధం మొదలైంది. క్రమంగా కార్బన్, లావా, సెల్‌కాన్, ఇంటెక్స్‌ వంటి దేశీ బ్రాండ్ల రాకతో 2010–12 మధ్య మొబైల్‌ ఫోన్ల కంపెనీల మధ్య పోటీ తారస్థాయికి చేరింది. దేశీయ మొబైల్‌ కంపెనీల దెబ్బకు ఒక దశలో నోకియా, సామ్‌సంగ్‌ మార్కెట్‌ వాటా తగ్గింది. 

ఏకంగా 230 బ్రాండ్స్‌..  
భారత మొబైల్స్‌ రంగంలో ఒకానొక దశలో 50%పైగా వాటాను దేశీయ కంపెనీలు చేజిక్కించుకున్నాయంటే అతిశయోక్తి కాదు. 230 దాకా భారతీయ బ్రాండ్స్‌ అమ్మకాలు సాగించాయి. ఫీచర్‌ ఫోన్లతోపాటు స్మార్ట్‌ఫోన్స్, ట్యాబ్లెట్‌ పీసీలు, టీవీల తయారీలోకి సైతం ప్రవేశించాయి. 

2010లో చైనా కంపెనీ హువావే భారత్‌లో అడుగుపెట్టగా షావొమీ, వివో, ఒప్పో ప్రవేశంతో 2014 నుంచి అసలైన యుద్ధం మొదలైంది. చైనా బ్రాండ్ల ముందు మన కంపెనీలు నిలవలేకపోయాయి. కొన్ని భారతీయ కంపెనీలు ఇప్పుడు ఫీచర్‌ ఫోన్లతో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నా స్మార్ట్‌ఫోన్ల విభాగం పోటీలో మాత్రం విదేశీ కంపెనీల దరిదాపుల్లో కూడా లేవు. 

ఎలా సాధ్యమైందంటే..
చవక ధరలో విక్రయించాలన్న లక్ష్యంతో ప్రవేశించిన దేశీయ బ్రాండ్స్‌ రిటైలర్ల మార్జిన్లపై దృష్టిపెట్టలేదనేది మార్కెట్‌ వర్గాల మాట. పైగా రూ. 10 వేలలోపు ధరల విభాగంలోనే ఇవి ప్రధానంగా దృష్టిపెట్టాయి. ఇక్కడే చైనా కంపెనీలు చక్రం తిప్పాయి. అధిక ఫీచర్లు, నాణ్యతకుతోడు రిటైలర్లకు అధిక లాభాలను అందించాయి. పైగా సొంత పరిశోధన, అభివృద్ధి విభాగాలతోపాటు స్మార్ట్‌ఫోన్ల తయారీ సైతం వాటి చేతుల్లోనే ఉండటంతో ధరలను శాసించాయి. 

విక్రయానంతర సేవలను చిన్న పట్టణాలకూ విస్తరించాయి. క్రమంగా చైనా బ్రాండ్లు భారతీయ మార్కెట్‌ను కైవసం చేసుకున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌ పరిమాణం పరంగా దాదాపు 70% వాటా చైనా కంపెనీలదే. ప్రభుత్వం చొరవ తీసుకుంటే తప్ప ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశీయ బ్రాండ్లకు అవకాశమే లేదన్నది నిపుణుల మాట.

ఇదీ భారత మార్కెట్‌..
» 2025 జూలై–సెప్టెంబర్‌ మధ్య 4.8 కోట్లస్మార్ట్‌ఫోన్లుఅమ్ముడయ్యాయి. 
» టాప్‌–10లోని సామ్‌సంగ్, యాపిల్, మోటరోలా మినహా మిగిలినవన్నీ చైనావే. 
» మన దేశంలో అమ్ముడవుతున్న స్మార్ట్‌ఫోన్‌సగటు ధర రూ. 26,400పైమాటే. 
» రూ.72 వేలు, ఆపై ఖరీదు చేసేమోడళ్ల అమ్మకాలు ఏడాదిలో53 శాతం పెరిగాయి. 
» విక్రయాల్లో ఆఫ్‌లైన్‌ వాటా48.3 నుంచి 56.4 శాతానికిదూసుకెళ్లగా ఆన్‌లైన్‌ విభాగం 51.7నుంచి 43.6 శాతానికి తగ్గింది.
» ఈ ఏడాది స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ రూ. 4.34 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా. 

ప్రస్తుతంస్మార్ట్‌ఫోన్లనువినియోగిస్తున్నవారి సంఖ్య70కోట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement