ఎబోలా విలయ తాండవం  | Ebola outbreak reaches 550 cases, at least 101 deaths in Congo | Sakshi
Sakshi News home page

ఎబోలా విలయ తాండవం 

Jun 10 2026 5:07 AM | Updated on Jun 10 2026 6:36 AM

Ebola outbreak reaches 550 cases, at least 101 deaths in Congo

కాంగోలో నెల రోజుల్లో 101 మంది మృతి  

550 కేసులు నమోదు 

బునియా: ఆఫ్రికా ఖండంలోని కాంగో దేశంలో ప్రాణాంతక ఎబోలా వైరస్‌ విలయ తాండవం చేస్తోంది. తూర్పు కాంగోలో ఎబోలా వ్యాప్తిని అధికారికంగా ప్రకటించిన నెల రోజుల వ్యవధిలోనే 101 మంది ఈ మహమ్మారి కాటుకు బలయ్యారు. ఇప్పటిదాకా 550 ఎబోలా కేసులు నమోదయ్యాయి. బాధితుల్లో 101 మంది మరణించారు. తూర్పు కాంగోలోని ఇటూరీ ప్రావిన్స్‌లో వైరస్‌ వ్యాప్తి ఉధృతంగా ఉంది. 90 శాతం కేసులు ఇక్కడే నమోదయ్యాయి. 

నార్త్‌ కివూ, సౌత్‌ కివూ ప్రావిన్స్‌ల్లోనూ ఎబోలా కేసులు వెలుగుచూస్తున్నాయి. ఉగాండా సరిహద్దు వరకూ వైరస్‌ వ్యాప్తి చెందినట్లు గుర్తించారు. వైరస్‌ నియంత్రణకు సరైన టీకా గానీ, చికిత్స గానీ లేకపోవడం, ప్రతిస్పందన సవాలుగా మారడం వల్ల కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు కాంగో అధికారులు చెబుతున్నారు. ఇటీవల ఎబోలా వ్యాధి వ్యాప్తికి అరుదైన ‘బుండిబుగ్యో’వైరస్‌ కారణం. 

దీనికి ఆమోదిత టీకా, చికిత్స విధానాలు లేవు. రోగ నిర్ధారణ పరీక్షలను పెంచామని ప్రభుత్వం తెలియజేసింది. గత 24 గంటల్లో 137 నమూనాలను పరీక్షించగా, వాటిలో 35 పాజిటివ్‌గా తేలాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) మంగళవారం తెలియజేసింది. ఆసుపత్రుల్లో బాధితులకు చికిత్స అందించేందుకు సరైన ఏర్పాట్లు లేవని ప్రజలు వైద్య సిబ్బందిపై దాడులకు దిగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే కొన్నిచోట్ల వేర్పాటువాద సాయుధ మిలిటెంట్‌ గ్రూప్‌ల ప్రాబల్యం ఉంది. అలాంటి ప్రాంతాలకు వైద్య సిబ్బంది చేరుకోలేకపోతున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement