రేపిస్టులకు, హంతకులకు మరణశిక్షే: ట్రంప్‌ | Donald Trump Slams Biden For Reducing Death Penalty | Sakshi
Sakshi News home page

రేపిస్టులకు, హంతకులకు మరణశిక్షే: ట్రంప్‌

Dec 25 2024 9:16 AM | Updated on Dec 26 2024 6:22 AM

Donald Trump Slams Biden For Reducing Death Penalty

వాషింగ్టన్‌: మరణశిక్షను కఠినంగా అమలు చేస్తానని అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్‌ ట్రంప్‌ మంగళవారం ప్రకటించారు. మరణశిక్ష పడిన ఫెడరల్‌ ఖైదీ శిక్షలను తగ్గించిన జో బైడెన్‌పై ట్రంప్‌ విరుచుకుపడ్డారు. ఉరిశిక్ష పడిన 40 మందిలో 37 మందికి పెరోల్‌ లేకుండా యావజ్జీవ కారాగార శిక్షను మారుస్తూ సోమవారం బైడెన్‌ తీసుకున్న నిర్ణయం అర్థరహితమని, బాధిత కుటుంబాలను అవమానించడమేనని ట్రంప్‌ విమర్శించారు.

 హింసాత్మక రేపిస్టులు, హంతకులు, రాక్షసుల నుంచి అమెరికన్‌ కుటుంబాలను, పిల్లలను రక్షించేందుకు మరణశిక్షను పకడ్బందీగా అమలు చేయాలని న్యాయశాఖను ఆదేశిస్తానని ట్రంప్‌ ప్రకటించారు. ‘మన దేశంలో అత్యంత దారుణమైన హంతకుల్లో 37 మందికి జో బైడెన్‌ మరణశిక్షను తగ్గించారు. ఇది నమ్మశక్యం కాని నిజం. దీనివల్ల బాధితుల బంధుమిత్రులు మరింత కుంగిపోతారు’అని ట్రంప్‌ తన సోషల్‌ మీడియా ప్లాటా్ఫమ్‌ ట్రూత్‌ సోషల్లో పోస్ట్‌ చేశారు.  

మరణశిక్షపై బైడెన్‌ తాత్కాలిక నిషేధం 
ఫెడరల్‌ మరణశిక్షపై బైడెన్‌ తాత్కాలిక నిషేధం విధించారు. ఉరిశిక్ష కోసం ఎదురుచూస్తున్న 40 మంది ఫెడరల్‌ ఖైదీల్లో 37 మందికి పెరోల్‌ అవకాశం లేకుండా జీవిత ఖైదుగా మారుస్తున్నట్లు అధ్యక్షుడు బైడెన్‌ సోమవారం ప్రకటించారు. 2013 బోస్టన్‌ మారథాన్‌ బాంబర్లలో ఒకరు, 2018లో 11 మంది యూదు ఆరాధకులను హత్య చేసిన దుండగుడు, 2015లో తొమ్మిది మంది నల్లజాతి చర్చిలలో కాల్పులు జరిపిన శ్వేతజాతి ఆధిపత్యవాదిని ఆయన తన ఉత్తర్వుల నుంచి మినహాయించారు. 

ఈ ఖైదీల్లో తోటి ఖైదీలను హత్య చేసిన తొమ్మిది మంది, బ్యాంకు దోపిడీల సమయంలో చేసిన హత్యలకు నలుగురు, జైలు గార్డును చంపిన కేసులో ఒకరు ఉన్నారు. బైడెన్‌ నిర్ణయంపై కొన్ని బాధిత కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అయితే ఫెడరల్‌ ఖైదీలకు మరణశిక్షను విధించడంలో కాబోయే అధ్యక్షుడు ట్రంప్‌కు మరింత కష్టతరం చేయాలని కోరుతూ న్యాయవాద గ్రూపుల నుంచి వచి్చన ఒత్తిడితో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉగ్రవాదం, విద్వేష ప్రేరేపిత సామూహిక హత్యలు కాకుండా ఇతర కేసుల్లో ఫెడరల్‌ మరణశిక్షలపై విధించిన నిషేధానికి అనుగుణంగా వారి శిక్షలను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చడం సమంజసమని బైడెన్‌ అన్నారు. ఏసీఎల్‌యూ, యూఎన్‌ కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ కాథలిక్‌ బిషప్స్‌ ఈ నిర్ణయాన్ని 
అభినందించాయి.

అధ్యక్షుడి ప్రమేయం ఎంత? 
క్రిమినల్‌ కేసుల్లో ప్రతివాదుల కోసం ఫెడరల్‌ ప్రాసిక్యూటర్లు కోరే శిక్షలను నిర్దేశించడంలో లేదా సిఫారసు చేయడంలో అధ్యక్షుల ప్రమేయం ఉండదు. అయినప్పటికీ ట్రంప్‌ చాలా కాలంగా న్యాయ శాఖ కార్యకలాపాలపై మరింత ప్రత్యక్ష నియంత్రణను కోరుతున్నారు. తాను అధికారంలోకి రాగానే మరణశిక్షను అమలు చేయా లని విభాగాన్ని ఆదేశిస్తానని అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయన ప్రకటించారు. పోలీసు అధికారులను చంపినవారికి, మాదకద్రవ్యాలు, మావన అక్రమ రవాణాకు పాల్పడినవారికి, యూఎస్‌ పౌరులను చంపిన వలసదారులకు ఫెడరల్‌ మరణశిక్షను విస్తరించాలని ఎన్నికల ప్రచారంలో పదేపదే చెప్పారు.

 మరణశిక్షను ఒక ముఖ్యమైన సాధనంగా తాను భావిస్తున్నానని, దానిని ఉపయోగించాలనుకుంటున్నానని ట్రంప్‌ చాలా స్థిరంగా చెప్పారు. అయితే ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం ఆచరణలో ఇది జరుగుతుందా? అనేది కష్టమైన విషయం. హత్యకు పాల్పడిన వ్యక్తులకు మరణశిక్షను ఒకప్పుడు చాలా మంది అమెరికన్లు సమరి్ధంచారు. కానీ కొన్ని దశాబ్దాలుగా ఈ మద్దతు తగ్గుతోంది. అక్టోబర్‌లో జరిగిన ఓ సర్వేలు.. సగం మంది అమెరికన్లు మరణశిక్షను వ్యతిరేకించారు. 2007లో నిర్వహించిన ఓ సర్వేలో మాత్రం 10 మంది అమెరికన్లలో 7 మంది మరణశిక్షను సమరి్థంచారు.  
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement