అస్తమానం టీవీ చూస్తున్న పిల్లాడు.. తల్లిదండ్రులు విధించిన శిక్షపై విమర్శలు..

China Parents Punish 8 Year Old Son Who Watches Too Much TV - Sakshi

బీజింగ్‌: 8 ఏళ్ల కుమారుడు అస్తమానం టీవీ చూస్తున్నాడని కఠిన శిక్ష విధించారు చైనాకు చెందిన తల్లిదండ్రులు. అయితే వీరి తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. చిన్న పిల్లలతో ఇలాగేనా ప్రవర్తించేది అని పలువురు మండిపడ్డారు.

సెంట్రల్ చైనా హునాన్ ప్రావిన్స్‌లో నివసించే ఈ జంట పని మీద బయటకు వెళ్తూ హోం వర్క్ పూర్తి చేసి ఆ తర్వాత పడుకోమని తమ కుమారుడికి చెప్పింది. అయితే వాళ్లు బయటకు వెళ్లి తిరిగి వచ్చే సరికి ఆ  బాలుడు టీవీ చూస్తున్నాడు. అంతేకాకుండా హోం వర్క్ కూడా పూర్తి చేయలేదు. 

దీంతో తల్లిదండ్రులకు కోపం వచ్చింది. ఫలితంగా రాత్రంతా టీవీ చూస్తూనే ఉండాలని కుమారుడికి శిక్ష విధించారు. ‍అతడు పడుకోకుండా ఇద్దరూ తరచూ అతడ్ని గమనించారు. అయితే మొదట స్నాక్స్ తింటూ హాయిగా టీవీ చూసిన పిల్లాడికి కాసేపయ్యాక అలసట వచ్చింది. ఫలితంగా తనవల్ల కాదని ఏడ్చాడు. కానీ తల్లిదండ్రులు మాత్రం ఉదయం 5 గంటల వరకు నిద్రపోనివ్వకుండా ‍అతడ్ని టీవీ ముందే కూర్చోబెట్టారు.

ఈ తల్లిదండ్రుల పేరెంటింగ్‌పై చైనాలో పెద్ద చర్చే మొదలైంది. ఈ శిక్ష చాలా కఠినంగా ఉందని, పిల్లాడికి ఒకవేళ ఇదే అలవాటై రోజు ఆలస్యంగా పడుకుని, ఉదయం కూడా ఆలస్యంగా నిద్ర లేస్తే ఏం చేస్తారని కొందరు ప్రశ్నించారు.

చైనాలో పేరెంటింగ్ సమస్యలు పెరిగి ప్రభుత్వం కొత్త చట్టాన్నే తీసుకువచ్చింది. తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా పెంచాలి, ప్రవర్తన ఎలా ఉండాలి అనే విషయాలపై అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టింది. పిల్లలు నేరాలు చేసినా, తప్పుగా ప్రవర్తించినా వాళ్లను హింసించకుండా మార్పు తీసుకురావాలని నిబంధనలు ఉన్నాయి.
చదవండి: ఎలాన్‌ మస్క్ తీరుతో అసంతృప్తి.. ట్విట్టర్‌కు అధికార పార్టీ గుడ్‌బై..

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top