ఒప్పందానికి మిత్రపక్షాల గ్రీన్‌సిగ్నల్‌ | Allies give green signal to Iran-US deal, says Donald Trump | Sakshi
Sakshi News home page

ఒప్పందానికి మిత్రపక్షాల గ్రీన్‌సిగ్నల్‌

Jun 12 2026 4:17 AM | Updated on Jun 12 2026 6:32 AM

Allies give green signal to Iran-US deal, says Donald Trump

దాడుల హెచ్చరిక వెనక్కి: ట్రంప్‌

హార్మూజ్‌ దిగ్బంధం యథాతథం

ఒప్పందం ఎప్పుడు కుదురుతుందో త్వరలో వెల్లడిస్తానని వ్యాఖ్య

వాషింగ్టన్‌: ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం కుదరనుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు. ఒప్పందంలోని అంశాలపై మిత్ర దేశాలు సానుకూలత తెలిపాయన్నారు. మరికొద్ది గంటల్లో ఇరాన్‌పై భీకర దాడులుంటాయంటూ తీవ్ర హెచ్చరికలు చేసిన ట్రంప్‌ ఈ మేరకు ప్రకటించడం గమనార్హం. ‘ఇప్పటిదాకా ఇరాన్‌ ప్రతినిధులతో జరిగిన చర్చల ప్రతిపాదనలు చివరకు ఇరాన్‌ అత్యున్నత నేతల దాకా వెళ్లాయి. వాళ్లు వాటిని ఆమోదించారు.

 అందుకే కొన్ని గంటల క్రితం ఇరాన్‌పై రాత్రి వేళ భీకర బాంబు దాడులు చేయాలనుకున్న నా నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నా. చర్చల్లో ప్రస్తావించిన కీలక అంశాలపై మధ్యవర్తిత్వ, భాగస్వామ్య దేశాలైన సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్, ఖతర్, తుర్కియే, పాకిస్తాన్, బహ్రెయిన్, కువైట్, జోర్డాన్, ఈజిప్ట్‌ తదితర దేశాలు సమ్మతి తెలపడం శుభపరిణామం. ఈ శాంతి ఒప్పందం కుదిరి, అమల్లోకి వచ్చేదాకా హార్మూజ్‌ జలసంధి దిగ్బంధం యథాతథంగా కొనసాగుతుంది. శాంతి ఒప్పందం ఏరోజు, ఎక్కడ కుదుర్చు కోబోతు న్నామో త్వరలోనే వెల్లడిస్తా’అని ట్రంప్‌ ట్రూత్‌ సోషల్‌లో వెల్లడించారు. 

అంతకుముందు ఇరాన్‌ చమురు పరిశ్రమను మొత్తం గుప్పిటపట్టేలా భీకర స్థాయిలో దాడులతో దురాక్రమణ చేస్తామని, అందుకు గురువారం రాత్రే ముహూర్తం ఖరారుచేశామని ట్రంప్‌ ప్రకటించారు. ఈ మేరకు తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్‌ సోషల్‌లో ఒక పోస్ట్‌పెట్టారు. ‘‘నావికాదళం, వైమానిక దళం, సైన్యం, రాడార్, గగనతల రక్షణ వ్యవస్థలు, అన్ని రకాల వ్యవస్థలను కోల్పోయిన ఇరాన్‌పై ఇక బీభత్సంగా బాంబులేస్తాం. అందుకు ఈరోజు రాత్రే ముహూర్తం పెట్టా. 

ఇరాన్‌ కీలక ఖర్గ్‌ ద్వీపంలోని అతిపెద్ద ఆయిల్‌ టర్మినల్‌ను త్వరలోనే వశపర్చుకుంటాం. ముడి చమురు పరిశ్రమ మొత్తాన్నీ మా పరం చేసుకుంటాం. అన్నింటినీ ఆక్రమిస్తాం. చమురు, సహజవాయు రంగాలన్నింటిపై ఆధిపత్యం సాధిస్తాం. అచ్చం వెనెజువెలాలో మెరుపుదాడులు చేసినట్లుగా అనూహ్యరీతిలో దాడులతో తెగబడతాం. మా దాడుల తర్వాత వెనెజువెలాపై అమెరికా ఆధిపత్యం మొదలైంది. దీంతో వెనెజువెలా, అమెరికా రెండింటికీ లాభం చేకూరింది. ఇప్పుడు దానినే ఇరాన్‌లో పునరావృతం చేస్తాం’’అని ట్రంప్‌ ప్రకటించారు.

 బుధవారం దాడులకు కొనసాగింపుగా గురువారం తెల్లవారుజామున సైతం దాడులుచేశాక ట్రంప్‌ ఈ పోస్ట్‌ పెట్టారు. ఖర్గ్‌ ద్వీపం అనేది ఇరాన్‌ చమురు పరిశ్రమకు గుండెకాయ. ఇక్కడి నుంచి 90 శాతం చమురు ఎగుమతులు జరుగుతాయి. అయితే ఖర్గ్‌ దీవిని స్వా«దీనంచేసుకోవడం అమెరికాకు అంత తేలికైన విషయం కాదు. దీవి నుంచి కేవలం 33 కిలోమీటర్ల దూరంలోనే ఇరాన్‌ ప్రధానభూభాగం, సైన్యం ఉంది. అక్కడి నుంచి దూసుకొచ్చే ఇరాన్‌ క్షిపణులను, ఆత్మాహుతి డ్రోన్లు, శతఘ్ని ఫిరంగులను అమెరికా పూర్తిస్థాయిలో నిలువరించడం కష్టమని నిపుణులు తేల్చేశారు.

 అయినాసరే ఖర్గ్‌ ద్వీపాన్ని స్వాదీనం చేసుకునేందుకు తాము అత్యంత ప్రాధాన్యతనిస్తామని గురువారం ఫాక్స్‌ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్‌ పునరుద్ఘాటించారు. ‘‘ద్వీపంలోకి అమెరికా బలగాలను దించుతా. సైనికులను రంగంలోకి దింపాల్సిందే. నిజానికి ఆర్మీని తీసుకురావడం నాకు ఇష్టంలేదు. కానీ మొత్తం దీవిని స్వా«దీనం చేసుకోవాలంటే సైన్యం రాక తప్పదు. స్వా«దీనం చేసుకున్నాక ఎంతకాలంపాటు దానిపై పట్టు నిలుపుకోగలం అనేది నాకైతే తెలీదు’’అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. 

కొనసాగిన అమెరికా దాడులు.. 
బుధవారం అర్ధరాత్రి దాటాక చాలా పొద్దుపోయాక అమెరికా ఇరాన్‌పై దాడులు చేసింది. ఇరాన్‌ సైనిక నిఘా సామర్థ్యాన్ని భారీగా దెబ్బతీశామని అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. బందర్‌ అబ్బాస్‌ తీర పట్టణం సహా హార్మూజ్‌ సమీప దక్షిణ ప్రాంతాలపై అమెరికా దాడులుచేసింది. టెహ్రాన్‌లోని తయారీ కర్మాగారం, సైనిక బ్యారెక్‌లు, స్థానిక పోలీసుల కేంద్రాలపైనా దాడులు జరిగాయని ఇరాన్‌ పారామిలటరీ రెవల్యూషనరీ గార్డ్‌ సైతం వెల్లడించింది. దాడులు మొదలెట్టి అమెరికా చర్చలకు అర్థంలేకుండా చేసిందంటూ ఇరాన్‌ విదేశాంగ శాఖ గురువారం ఒక ప్రకటనలో తీవ్ర నిరసన వ్యక్తంచేసింది. ఇజ్రాయెల్‌ వంటి మిత్రదేశాలకు ఇరాన్‌ కారణంగా జరిగిన ఆర్థిక నష్టాలను పూడ్చుకునేందుకు విదేశాల్లో మేం జప్తుచేసుకున్న ఇరాన్‌ బ్యాంక్, ఆర్థిక ఖాతాల నుంచి రాబట్టుకుంటామని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్‌ బీసెంట్‌ ప్రకటించారు.  

Advertisement
 
Advertisement
Advertisement