డేటా సెంటర్లు..నీటి జలగలు! | AI data centres could use as much water as 1. 3 billion people by 2030 | Sakshi
Sakshi News home page

డేటా సెంటర్లు..నీటి జలగలు!

Jun 9 2026 4:39 AM | Updated on Jun 9 2026 5:34 AM

AI data centres could use as much water as 1. 3 billion people by 2030

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఏఐ డేటా సెంటర్లు ఎడాపెడా వెలుస్తున్నాయి. రకరకాల పనులు చాలా సులువుగా, వేగంగా చేసి పెట్టే టెక్నాలజీ మరింత పెరిగితే బాగుంటుందని అందరూ అనుకుంటున్నారు. కానీ.. నాణేనికి మరోవైపున దాగి ఉన్న నిజం మాత్రం చాలా భయంకరం. ఐక్యరాజ్యసమితికి చెందిన యునైటెడ్‌ నేషన్స్‌ యూనివర్సిటీ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ వాటర్‌ ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ హెల్త్‌ (ఐఎన్‌యూ–ఐఎన్‌డబ్ల్యూఈహెచ్‌) మేధో సంస్థ తాజా లెక్కల ప్రకారం 2030 నాటికల్లా భూమి మీద డేటా సెంటర్లు మొత్తం కలిపి ఎకాఎకిన 328 టీఎంసీల నీరు వాడేసుకుంటాయి. 

దీనర్థం ఎక్కడ డేటా సెంటర్‌ పుట్టుకొచి్చనా.. పెద్ద ఎత్తున నీళ్లు అవసరమవుతాయి. సముద్రపు నీటిని మంచినీటిగా మార్చుకుని వాడుకుంటే గొడవే లేదు కానీ.. నదులు, చెరువుల్లోంచి తోడుకుంటే మాత్రం ఏరికోరి కరువుకు బొట్టుపెట్టి పిలిచినట్లే. ఐఎన్‌యూ–ఐఎన్‌డబ్ల్యూఈహెచ్‌ భూమ్మీది నీటి వనరుల పరిస్థితి, సమర్థ నిర్వహణలపై నిత్యం ఓ కన్నేసి ఉంచుతూ ఉంటుంది. ఇటీవలే ఏఐ డేటా సెంటర్ల నీటి వాడకంపై కొన్ని లెక్కలు ప్రచురించింది. దాని ప్రకారం ఇంకో నాలుగేళ్లలో డేటా సెంటర్ల అవసరాలు తీర్చేందుకు సుమారు 9.3 లక్షల కోట్ల లీటర్ల నీళ్లు అవసరం. 

సుమారు 945 టెరావాట్‌ గంటల విద్యుత్తు ఖర్చు కానుంది. వెయ్యి గిగావాట్లు ఒక టెరావాట్‌కు సమానం. ఇంకోలా చెప్పాలంటే గిగావాట్‌ సామర్థ్యమున్న అణు విద్యుత్తు కేంద్రాలు 108 వరకూ కేవలం ఏఐ డేటా సెంటర్ల నీటి అవసరాలు తీర్చేందుకే సరిపోతాయి. ప్రపంచ విద్యుదుత్పత్తిలో మూడో శాతం అన్నమాట. డేటా సెంటర్ల ఏర్పాటుకు సుమారు 14,500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నేల అవసరమవుతోంది. వీటి ద్వారా పుట్టే ఎల్రక్టానిక్‌ వ్యర్థాలు 25 లక్షల టన్నుల వరకూ ఉంటాయని ఐఎన్‌యూ–ఐఎన్‌డబ్ల్యూఈహెచ్‌ తాజా అధ్యయనంలో స్పష్టమైంది. 

అంతటి అపార జలరాశితో పనేంటి? 
మీ కంప్యూటర్‌ను కొన్ని గంటలపాటు వాడితేనే వేడెక్కి పోతుంది కదా.. అలాంటిది దీనికి కొన్ని లక్షల పీసీలు ఒక దగ్గర పనిచేస్తూంటే ఎంత వేడి పుడుతుందో ఊహించుకోండి. డేటా సెంటర్ల పరిస్థితి ఇదే. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన డేటా సెంటర్‌గా అమెరికాలోని స్విచ్‌ సిటడెల్‌కు పేరుంది. పర్సనల్‌ కంప్యూటర్‌(పీసీల)ల లెక్కన ఈ డేటా సెంటర్‌ను గణిస్తే ఇందులో సుమారు 32 లక్షల యాభై వేల పీసీ ఒకేసారి పని చేస్తున్నట్లు లెక్క.

 అందుకే ఇక్కడ పుట్టే అత్యధిక వేడిని తగ్గించేందుకు డేటా సెంటర్లను నిత్యం నీటితో చల్లబరుస్తూ ఉండాలి. లేదంటే ఉష్ణోగ్రత పెరిగిపోయి డేటా సెంటర్‌ పనిచేయకుండా పోతుంది. వీటిపై ఆధారపడిన అనేకానేక అప్లికేషన్లు, వ్యవస్థలు కుప్పకూలుతాయి. ప్రపంచవ్యాప్తంగా సుమారు 11 వేల డేటా సెంటర్లు ఉండగా వీటిల్లో సగం అమెరికాలోనే ఉన్నాయి. ఒక్కొక్కటీ 100 నుంచి 600 మెగావాట్ల విద్యుత్తును వినియోగించుకుంటున్నాయి. మెట్రో నగరాలకు కావాల్సినంత విద్యుత్తు ఇది. ఫలితంగా డేటా సెంటర్ల పరిసరాల్లోని నీటి వనరులు శరవేగంగా ఖాళీ అవడం ఖాయం.  

కింకర్తవ్యం? 
ప్రస్తుతానికి వేరే మార్గం లేదు. చైనా వంటి దేశాలు సముద్రం అడుగున డేటా సెంటర్లను ఏర్పాటు చేసి ఆ నీటితోనే చల్లబరిచే ప్రయత్నం చేస్తున్నాయి. గూగుల్‌ లాంటి దిగ్గజ కంపెనీలు ఇంకో అడుగు ముందుకేసి అంతరిక్షంలో డేటా సెంటర్ల ఏర్పాటుకు ఆలోచనలు చేస్తున్నాయి. మరింత పర్యావరణ అనుకూల మార్గాల ద్వారా డేటా సెంటర్లను చల్లబరిచే ప్రయత్నం జరగాలని నిపుణులు ఆకాంక్షిస్తున్నారు. ఏఐ డేటా సెంటర్లు పర్యావరణంపై చూపే ప్రభావాన్ని మదింపు చేసి తగు నియంత్రణ చర్యలు తీసుకోవడం అవసరమవుతుంది. లేదంటే డేటా సెంటర్లు మానవ జీవనాధారమైన కీలక జలరాశిని పీల్చేసే ప్రమాదం ఉంది. 
– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

Advertisement
 
Advertisement
Advertisement