కూతురి వివాహం చేసిన మరుసటి రోజే తండ్రి మృతి
శంషాబాద్: సంబరంగా కుమార్తె పెళ్లి చేసిన మరుసటి రోజే ఓ తండ్రి గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషాద సంఘటన శంషాబాద్ మండల పరిధిలోని మల్కారం గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన మేరకు.. మల్కారం గ్రామానికి చెందిన రైతు దండు సురేందర్ (50) పెద్ద కుమార్తె పావనికి ఇబ్రహీంపట్నం గ్రామానికి యువకుడితో వివాహాన్ని బుధవారం నర్కూడ గ్రామంలో ఘనంగా చేశాడు. గురువారం వరుడి ఇంటి వద్ద జరిగే విందు కార్యక్రమానికి వెళ్లాల్సి ఉంది. అయితే ఉదయమే పొలం పనులు చూసుకోడానికి వెళ్లిన సురేందర్ అక్కడే స్పృహ కోల్పోయి పడిపోయాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో కుటుంబసభ్యులు, తీవ్ర శోకంలో మునిగిపోయారు.


