నిమ్స్‌లో బ్యాటరీ కార్లు | Sakshi
Sakshi News home page

నిమ్స్‌లో బ్యాటరీ కార్లు

Published Tue, May 30 2023 5:22 AM

- - Sakshi

లక్డీకాపూల్‌ : నిమ్స్‌లో చికిత్సకు వచ్చే రోగుల సౌకర్యార్థం బ్యాటరీ కార్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు యాజమాన్యం రంగం సిద్ధం చేసింది. ఆస్పత్రి మెయిన్‌ గేట్‌ వద్ద కార్లను ఏర్పాటు చేయనున్నారు. నిమ్స్‌ లోపలికి ప్రైవేట్‌ వాహనాల ప్రవేశాన్ని నియంత్రించే క్రమంలో బ్యాటరీ కార్లను ప్రవేశపెట్టనున్నారు. ముఖ్యంగా ఆటోలు, క్యాబ్‌లను నియంత్రించేందుకు యాజమాన్యం ఈ దిశగా చర్యలు చేపట్టింది.

ఆస్పత్రి ప్రాంగణంలో జటిలంగా తయారైన ట్రాఫిక్‌ సమస్యను సైతం చక్కదిద్దే క్రమంలో వినూత్న చర్యలకు ప్రణాళికలను సిద్ధం చేసినట్టు అధికారులు పేర్కొంటున్నారు. ఇందులో భాగంగా జూన్‌ మొదటి వారంలో అందుబాటులో రానున్న బ్యాటరీ కార్లు రోగుల అవసరాలను తీర్చే విధంగా దోహదపడతాయి. ఈ కార్ల సేవలు నగరంలో ఇప్పటికే సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో అందుబాటులో ఉన్నాయి.

ఆస్పత్రి రంగంలో తొలిసారిగా నిమ్స్‌ ప్రవేశపెట్టనుంది. ఆంధ్రా బ్యాంకు అయిదు బ్యాటరీ కార్లను సమకూర్చనుంది. కొంత మంది దాతలు ఈ కార్లను సమకూర్చేందుకు ముందుకు వస్తున్నారని, ఇప్పటికి కొన్ని సేవలకు సిద్ధంగా ఉన్నాయని నిమ్స్‌ ఇన్‌చార్జిర్జి డైరెక్టర్‌ డాక్టర్‌ నగరి బీరప్ప, నిమ్స్‌ ఏపీఆర్‌ సత్యాగౌడ్‌ తెలిపారు. ఎర్రమంజిల్‌ కాలనీలో రవీంద్రనాథ్‌ ఠాకూర్‌ స్కూల్‌ కొనసాగిన ప్రాంతంలో నిర్మించతలపెట్టిన 2 వేల పడకల బహుళ అంతస్తుల సముదాయానికి వచ్చే నెల 14న ముఖ్యమంత్రి కేసీఆర్‌ భూమి పూజ చేస్తారని చెప్పారు.

Advertisement
Advertisement