వరంగల్ అర్బన్ : గ్రేటర్ వరంగల్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను నాణ్యతాప్రమాణాలతో, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి.వెంకన్న ఆదేశించారు. నగరంలోని పలు డివిజన్లలో పూర్తయిన అభివృద్ధి పనులను బిల్లుల చెల్లింపుల నిమిత్తం మంగళవారం కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముందుగా 49వ డివిజన్లోని రెవెన్యూ కాలనీ, ప్రకాశ్రెడ్డిపేట ప్రాంతాల్లో నిర్మించిన సీసీ రోడ్లు, మురుగు కాల్వలను పరిశీలించారు. అనంతరం పోచమ్మ మైదాన్, ఎల్బీనగర్, చింతల్, ఖిలా వరంగల్ ప్రాంతాల్లో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రెయినేజీ కాల్వలు, మంచినీటి పైపులైన్ నిర్మాణ పనుల నాణ్యతను తనిఖీ చేశారు. పోచమ్మ మైదాన్లో నిర్మిస్తున్న కమ్యూనిటీ హాల్ పనులను పరిశీలించి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు దీర్ఘకాలికంగా ఉపయోగపడేలా పనులు చేపట్టాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఈఈ రవికుమార్, సంతోష్ బాబు, డీఈలు, ఏఈలు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.
ఐఎఫ్ఏటీ సదస్సుకు కమిషనర్
మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈనెల 9 నుంచి 11 వరకు నిర్వహించనున్న 13వ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫర్ వేస్ట్ వాటర్ టెక్నాలజీ (ఐఎఫ్ఏటీ) ఇండియా–2026 సదస్సుకు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి.వెంకన్న హాజరుకానున్నారు. పట్టణ నీటి నిర్వహణ, మురుగునీటి శుద్ధి, ఘనవ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్, బయోగ్యాస్, ఈవేస్ట్, ఆధునిక పర్యావరణ సాంకేతికతలపై నిర్వహించే ప్రదర్శనలు, సాంకేతిక సమావేశాలు, నిపుణులతో చర్చలు, జ్ఞాన మార్పిడి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు.
జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న


