ఉన్నత పాఠశాలలు, కేజీబీవీల్లో సైన్స్ ప్రయోగశాలలు
విద్యారణ్యపురి: ప్రభుత్వ ఉన్నత పాఠశాలు, పలు కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయా(కేజీబీవీ)ల్లో సైన్స్ ప్రయోగశాలలను ఏర్పాటు చేయనున్నారు. 9, 10 తరగతుల విద్యార్థులకు ప్రయోగాత్మక బోధనకు శ్రీకారం చుట్టనున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని హనుమకొండ, వరంగల్, జనగామ, ములుగు మహబూబాబాద్ జిల్లాల్లో ఎంపిక చేసిన 26 ఉన్నత పాఠశాలల(కేజీబీవీలతో కలిపి)కు రూ.6.76 కోట్లు సమగ్రశిక్ష నుంచి మంజూరు లభించింది. ఇటీవల రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్, రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ (సమగ్ర శ్రిక్ష) నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఒక్కో పాఠశాలకు రూ.26 లక్షలు
ఒక్కో పాఠశాలకు రూ.26 లక్షల చొప్పున కేటాయించారు. ఈ నిధులతో సైన్స్ ల్యాబొరేటరీ గదుల నిర్మాణం, పరికరాల సేకరణ, సరఫరా, ఇన్స్టాలేషన్ టెస్టింగ్ కమిషనింగ్కు పరిపాలనా అనుమతి ఇచ్చారు. ల్యాబ్ గది నిర్మాణానికి రూ.25లక్షలు, పరికరాలకు రూ.లక్ష కేటాయించారు. పనులను రాష్ట్ర విద్యామౌలిక సదుపాయాల సంస్థ (టీజీఈడబ్లూ ఐడీసీ – హైదరాబాద్)కి అప్పగించారు. ఇ–ప్రొక్యూర్మెంట్ విధానంలో టెండర్లు ఆహ్వానించి కాంట్రాక్టర్లకు అప్పగించనున్నారు.
ఈ నిబంధనలు పాటించాల్సిందే..
సైన్స్ లేబొరేటరీలు నిర్మాణం పూర్తయ్యాక వర్క్స్టేషన్లు, పరికరాలు టీజీఈడబ్ల్యూ ఐడీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి సంయుక్తంగా తనిఖీ చేసి నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్లు ధ్రువీకరించాలి. ఆ తర్వాత వాటిని ఆయా పాఠశాలల హెచ్ఎంలకు అప్పగించాల్సి ఉంటుంది.
● ఐదు జిల్లాల్లో 26 ఉన్నత పాఠశాలలకు
రూ.6.76 కోట్లు మంజూరు
● జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు కేటాయించని నిధులు


