హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్
హన్మకొండ అర్బన్: పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి, సహజ రంగులతో తయారు చేసిన వినాయక విగ్రహాలను మాత్రమే ప్రతిష్టించాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ కోరారు. సోమవారం కలెక్టరేట్లో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి, జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించిన మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ ఎన్.రవితో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈసందర్భంగా పర్యావరణ పరిరక్షణపై రూపొందించిన వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో టీజీపీసీబీ నోడల్ అధికారి బి.జీమూత వాహన, అధికారులు పాల్గొని ప్రజలకు వినాయక మట్టి విగ్రహాలు పంపిణీ చేశారు.
75 శాతం నోటీసులు జారీ
ఎస్ఐఆర్లో భాగంలో జిల్లాలో అనామలీస్, నో మ్యాపింగ్ జాబితాలోని ఓటర్లకు ఇప్పటివరకు సుమారు 75 శాతం నోటీసులు జారీ చేసినట్లు హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ తెలిపారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్)లో అనామలీస్, నో మ్యాపింగ్ కేటగిరీలో గుర్తించిన ప్రతీ ఓటరుకు నోటీసులు, పురోగతిపై సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల అధికారి పి.సుదర్శన్రెడ్డి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో సమీక్షించారు. అనంతరం కలెక్టర్ చాహత్ మాట్లాడుతూ.. విచారణకు హాజరుకాని వారికి రెండోసారి నోటీసులు జారీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అదనపు కలెక్టర్ ఎన్.రవి, ఆర్డీఓ వెంకటేశ్, ఏఈఆర్ఓ రవీందర్రెడ్డి, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ జగత్సింగ్, తదితరులు పాల్గొన్నారు.
వేగంగా పూర్తి చేయాలి
హనుమకొండ జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. పూర్తయిన పనుల బిల్లుల చెల్లింపులు సకాలంలో జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. సోమవారం కలెక్టరేట్లో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ, అంగన్న్వాడీ కేంద్రాలు, మహిళా సంఘాల భవనాల నిర్మాణ పనుల పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. మండలాల వారీగా పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో డీఆర్డీఓ మేన శ్రీను, జిల్లా సంక్షేమ అధికారి విశ్వజ, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ డీఈలు రాజగోపాల్రావు, శ్రీనివాస్రావు, శిరీష, యుగంధర్, రామ్దేవ్ అగర్వాల్, ఏఈలు, అధికారులు పాల్గొన్నారు.
వైద్యారోగ్య సేవల్లో జిల్లా ముందుండాలి
వైద్య, ఆరోగ్య శాఖ కార్యక్రమాల అమలులో హనుమకొండ జిల్లాను ముందంజలో నిలపాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. గర్భిణులకు నెలవారీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించడంతో పాటు మాతా శిశు సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సోమవారం కలెక్టరేట్లో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న వివిధ కార్యక్రమాలు, గర్భిణుల నమోదు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు, ప్రైవేట్ ఆస్పత్రుల్లో సిజేరియన్ కేసులపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. డీఎంహెచ్ఓ అప్పయ్య, డీఐఓ డాక్టర్ కృష్ణారావు, అదనపు డీఎంహెచ్ఓ మదనన్ మోహన్రావు, ఎన్సీడీ అధికారి మురళి, మాతా శిశు సంరక్షణ అధికారి రజిత, డిప్యూటీ డీఎంహెచ్ఓ ప్రదీప్రెడ్డి, ఐడీఎస్పీ ప్రోగ్రాం అధికారి జ్ఞానేశ్వర్ అధికారులున్నారు.


