విద్యారణ్యపురి: నవలా రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ అంపశయ్య నవీన్ పుట్టిన రోజును పురస్కరించుకొని ప్రతి సంవత్సరం నిర్వహించే ప్రథమ నవలా పోటీలను ఈసారి కూడా నిర్వహించనున్నట్లు అంపశయ్య నవీన్ లిటరరీ ట్రస్ట్ కార్యదర్శి డి.స్వప్న ఆదివారం తెలిపారు. రచయిత రాసిన మొట్టమొదటి నవలను మాత్రమే ఈ పోటీలకు పంపాలని, పుస్తక రూపంలో వచ్చిన నవలలు అంగీకరించబోమని పేర్కొన్నారు. డీటీపీ లేదా చేతిరాతతో 200 పేజీలకు మించకుండా 100 పేజీలకు తక్కువ కాకుండా ఉన్న నవలా రెండు ప్రతులను నవీన్ రెసిడెన్సి, 2–7–71 ఎకై ్సజ్కాలనీ, హనుమకొండకు అక్టోబర్ 31లోగా పంపించాలని కోరారు. ప్రథమ బహుమతి రూ.20 వేలు, ద్వితీయ బహుమతి రూ.15వేలు ఉంటుందని ఆమె తెలిపారు.
ఘనంగా పుస్తకాల ఆవిష్కరణ
హన్మకొండ కల్చరల్ : రుద్రమ ప్రచురణలు ‘సెలయేటి గలగలలు’ వ్యాస సంపుటి, ‘అనిశెట్టి రజిత సాహిత్యంతో సంభాషణ’ పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం హనుమకొండలోని లష్కర్బజార్ హైస్కూల్లో ఆదివారం జరిగింది. రుద్రమ ప్రచురణల బాధ్యులు కొమర్రాజు రామలక్ష్మి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కొమర్రాజు రామలక్ష్మి రచించిన ‘సెలయేటి గలగలలు’ వ్యాస సంపుటిని కేంద్ర సాహిత అకాడమీ గ్రహీత డాక్టర్ అంపశయ్య నవీన్ ఆవిష్కరించారు. అలాగే, రామలక్ష్మి, డాక్టర్ బండారు సుజాత సంపాదకత్వంలో వెలువడిన ‘అనిశెట్టి రజిత సాహిత్యంతో సంభాషణ’ పుస్తకాన్ని రిటైర్డ్ ప్రిన్సిపాల్ విజయలక్ష్మి ఆవిష్కరించారు. ముందుగా అనిశెట్టి రజిత చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంపశయ్య నవీన్ మాట్లాడుతూ.. రచయిత మంచి విశ్లేషణ, సాదాసీదా వచనంతో చక్కగా రాశారని అన్నారు. కార్యక్రమంలో కేయూ విశ్రాంత ఆచార్యులు బన్న అయిలయ్య, కవి పొట్లపల్లి శ్రీనివాసరావు, గిరిజారాణి, వల్లంపట్ల నాగేశ్వరరావు, పల్లేరు వీరస్వామి, నిధి, రమాదేవి, బిల్ల మహేందర్, సింగరాజు రమాదేవి, బిట్ల అంజనీదేవి, మేరాడి శ్యామల, సిరాజుద్దీన్, డాక్టర్ ఆకునూరి విద్యాదేవి పాల్గొన్నారు.
మల్లంపల్లి సమీపంలో వ్యక్తి మృతదేహం లభ్యం
ములుగు : ములుగు జిల్లా మల్లంపల్లి మండలంలోని మల్లంపల్లి–మహ్మద్గౌస్పల్లి గ్రామాల మధ్య జాతీయ రహదారి పక్కన ఆదివారం ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. అక్కడ లభించిన ఆధారాల ప్రకారం.. హనుమకొండ జిల్లా కాజీపేటకు చెందిన ముక్తార్ మహమ్మద్ (46)గా గుర్తించామని మల్లంపల్లి ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు. మృతికి గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ములుగు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామని పేర్కొన్నారు.
పేకాట శిబిరాలపై దాడి
ఖిలా వరంగల్ : పేకాట శిబిరాలపై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేసినట్లు ఇన్స్పెక్టర్ సుబ్బారెడ్డి తెలిపారు. మధ్యకోట రజకవీధి, పడమరకోట ఎరుకల వీధిలో పేకాడుతున్నట్లు టాస్క్ఫోర్స్ ఏసీపీ మధుసూదన్కు సమాచారం అందింది. ఆయన ఆదేశాల మేరకు పేకాట స్థావరాలపై దాడి చేసి రూ.10,080 నగదు స్వాధీనం చేసుకున్నారు. పల్లకొండ సమ్మయ్య, బైరి ప్రతాప్, బీరం బద్రి, బూర అనురాధ, గన్నారపు రాజు, ఎండీ అన్వర్, శ్యాం, రాఘవులు పై కేసు నమోదు చేసి తదుపరి చర్యల నిమిత్తం కేసును మిల్స్కాలనీ పోలీసులకు అప్పగించినట్లు ఇన్స్పెక్టర్ సుబ్బారెడ్డి తెలిపారు.


