హన్మకొండ: కాంగ్రెస్ ప్రభుత్వ వేయి రోజుల వైఫల్య పాలనపై బీఆర్ఎస్ చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. వారం రోజుల బీఆర్ఎస్ సమరభేరి కార్యక్రమంలో భాగంగా బుధవారం 420 హామీలతో కూడిన 420 అడుగుల ఫ్లెక్సీతో హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీపై పోలీసులు ముందు నుంచి అభ్యంతరం తెలుపుతూ వచ్చారు. ర్యాలీ కాళోజీ కూడలికి చేరుకోగా పోలీసులు రోప్ పార్టీతో అడ్డుకున్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పోలీసు వలయాన్ని ప్రతిఘటిస్తూ ముందుకు సాగారు. ర్యాలీ తెలంగాణ అమరవీరుల స్తూపం కూడలికి చేరుకోగానే ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ను అరెస్ట్ చేసేక్రమంలో ఆయన తీవ్ర ఒత్తిడితో నొప్పి భరించలేక కేకలు వేశారు. చివరికి ఆయనను పోలీసు వాహనంలోకి ఎక్కించి సుబేదారి పోలీస్ స్టేషన్కు తరలిస్తున్న క్రమంలో పార్టీ కార్యకర్తలు వాహనానికి అడ్డుగా బైఠాయించారు. మరోవైపు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఫ్లెక్సీతో హనుమకొండ కలెక్టరేట్కు చేరుకుని ధర్నా చేశారు. వినయ్భాస్కర్ను అరెస్ట్ చేశారని సమాచారం అందుకున్న మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ సుబేదారి పోలీస్ స్టేషన్కు చేరుకుని పరామర్శించారు. అనంతరం వినయ్భాస్కర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా పీడిత పాలన సాగుతోందని విమర్శించారు. వేయి రోజుల కాంగ్రెస్ పాలన వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతునే ఉంటామన్నారు. ఒకరోజు ముందు అనుమతి ఇచ్చిన పోలీసులు నిరసన కార్యక్రమం చేపడితే అక్రమ అరెస్టు చేశారన్నారు. వీధి రౌడీల మాదిరిగా పండ్ల బండ్ల వారి కత్తులతో 420 హామీల ఫ్లెక్సీపై దాడి చేశారని ఆరోపించారు. వినోద్కుమార్ మాట్లాడుతూ శాంతియుతంగా నిరసన చేస్తున్న నాయకులను అరెస్టు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. నిరసనలో నాయకులు మర్రి యాదవరెడ్డి, కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి, వద్దిరాజు గణేష్, బీరవెళ్లి భరత్కుమార్, జోరిక రమేష్, పోలేపల్లి రామ్మూర్తితోపాటు నాయకులు, కారకర్తలు పాల్గొన్నారు.
420 అడుగుల ఫ్లెక్సీతో ర్యాలీ తీస్తున్న
బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు
420 అడుగుల ఫ్లెక్సీతో ర్యాలీ,
కలెక్టరేట్ ఎదుట ధర్నా
అడ్డుకున్న పోలీసులు.. ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అరెస్ట్


