హన్మకొండ: వినాయక చవితి, గణపతి నవరాత్రి ఉత్సవాలను ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత ఉత్సవ కమిటీలు, మండపాల నిర్వాహకులకు సూచించారు. బుధవారం హనుమకొండ కలెక్టరేట్లో హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాల్లో గణపతి నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లు, నిర్వహణపై కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా సీపీ శ్వేత మాట్లాడుతూ.. పోలీస్, అధికారుల సూచనలు పాటిస్తూ భక్తిశ్రద్ధలతో, స్నేహపూర్వక వాతావరణంలో వేడుకలు నిర్వహించాలన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాల్సి వస్తే స్థానిక ఏసీపీ అనుమతి తీసుకోవాలని సూచించారు. నిమజ్జన ప్రాంతాల్లో క్రేన్లు, గజ ఈతగాళ్లు, లైటింగ్, బారికేడ్లు, వైద్య సిబ్బందిని ముందుగానే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ మాట్లాడుతూ.. ప్రజలు, ఉత్సవ కమిటీలు మట్టి గణపతి విగ్రహాలను ఏర్పాటు చేసేలా ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. వరంగల్ కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ సమీప నిమజ్జన ప్రాంతాలను గుర్తించాలన్నారు. జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న మాట్లాడుతూ గణపతి నవరాత్రుల సందర్భంగా ఇబ్బందులు ఎదురైతే పోలీస్ కంట్రోల్ రూమ్ 87126 85048 నంబర్కు సమాచారమందించాలని కోరా రు. సమావేశంలో హనుమకొండ అదనపు కలెక్టర్ రవి, డీసీపీలు దార కవిత, అంకిత్కుమార్, రాజమహేంద్ర నాయక్, జనగామ అదనపు కలెక్టర్ బెన్ షాలోం, అధికారులు, పోలీసులు కమిషనరేట్ పరిధి ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారు.
సైబర్ భద్రత పోస్టర్ ఆవిష్కరణ
వరంగల్ క్రైం: తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా రూపొందించిన సైబర్ భద్రత అవగాహన పోస్టర్ను బుధవారం వరంగల్ కమిషనరేట్ కార్యాలయంలో సీపీ శ్వేత ఆవిష్కరించారు. సైబర్ క్రైం స్టేషన్ ఏసీపీ వెంకటరమణ, ఎస్బీ–2 ఏసీపీ జానీ నర్సింహులు, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఎస్సైలు చరణ్, శివ పాల్గొన్నారు.
వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత
ఉత్సవాల నిర్వహణపై
అధికారులతో సమావేశం


