నయీంనగర్ : ఐటీ జాబ్, ఉన్నత చదువు కోసం అమెరికాలో నివసిస్తున్న తెలంగాణ ఎన్ఐఆర్లకు వీసా నిబంధనల్లో సడలింపులివ్వాలని అమెరికా కాంగ్రెస్ ప్రతినిధులను ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు కోరారు. అమెరికా పర్యటనలో ఉన్న రవీందర్ రావు వర్జీనియా 10వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ ప్రతినిధి సుహాస్ సుబ్రహ్మణ్యం, 11వ డిస్ట్రిక్ట్ ప్రతినిధి జేమ్స్ వాకిన్ షాను కలిశారు. అమెరికాలో 12 లక్షల మందికిపైగా తెలుగువాళ్లు నివసిస్తున్నారని, అందులో 6 లక్షల మంది వరకూ తెలంగాణ వాసులు ఉన్నారని, టూరిస్ట్ వీసాల్లో ఆ కుటుంబాల ఇబ్బందులను రవీందర్ రావు వారికి వివరించారు. లక్ష డాలర్ల ఫీజు చెల్లింపును తగ్గించే విషయమై పార్లమెంట్లో ప్రస్తావించాలని వారికి విన్నవించారు. ఇందుకు వారు సానుకూలంగా స్పందించి, హామీ ఇచ్చారు. అమెరికా కాంగ్రెస్ ప్రతినిధులను కలిసిన వారిలో రవీందర్ రావుతో పాటు పులి రవి, డాక్టర్ భిక్షం గుజ్జ ఉన్నారు.


