బైక్‌ ఇచ్చి వస్తానని వెళ్లి.. అనంతలోకాలకు.. | - | Sakshi
Sakshi News home page

బైక్‌ ఇచ్చి వస్తానని వెళ్లి.. అనంతలోకాలకు..

Sep 3 2026 8:41 AM | Updated on Sep 3 2026 8:41 AM

కేయూ క్యాంపస్‌ : స్నేహితుడిని రక్తదానం చేయించేందుకు తీసుకెళ్లిన ఓ ఇంజనీరింగ్‌ విద్యార్థి రోడ్డు ప్రమాదంలో మృత్యుఒడికి చేరాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి హనుమకొండలోని పబ్లిక్‌ గా ర్డెన్‌ సమీపం గ్రంథాలయం రోడ్డులో చోటు చేసుకుంది. కాకతీయ యూనివర్సిటీ ఇంజనీరింగ్‌ కళా శాల ప్రిన్సిపాల్‌ రమణ, హాస్టల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ దయాకర్‌ కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి ప్రాంతానికి చెందిన గుగులోత్‌ భరత్‌(21) కేయూ ఇంజనీరింగ్‌ కళాశాలలో ట్రిపుల్‌ఈ మూడో సంవత్సరం చదువుతూ కాలేజీ హాస్టల్‌లో ఉంటున్నాడు. భరత్‌కు హనుమకొండ బస్టాండ్‌ సమీపంలోని ఓ బ్లడ్‌ బ్యాంకు నిర్వాహకులతో పరి చయం ఉంది. వారు అర్జెంట్‌గా ఓ బ్లడ్‌ గ్రూప్‌నకు సంబంధించి రక్తం కావాలని భరత్‌కు ఫోన్‌ చేశారు. దీంతో భరత్‌ తన స్నేహితుడు సాయినికేతన్‌తో రక్తదానం చేయించేందుకు అదే కళాశాలకు చెందిన వేరే వ్యక్తి బైక్‌పై మంగళవారం అర్ధరాత్రి ఆ బ్లడ్‌ బ్యాంకు వెళ్లారు. సాయినికేతన్‌ రక్తదానం చేస్తుండగా కొంత సమయం పడుతుందని భావించిన భరత్‌.. ఆ బైక్‌ను సదరు వ్యక్తికి ఇచ్చి వస్తానని అంబేడ్కర్‌ సెంటర్‌ రోడ్డు వైపు వస్తున్నాడు. ఈ క్రమంలో పబ్లిక్‌గార్డెన్‌ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగి తీవ్ర గాయాలతో పడి ఉన్నాడు. దీనిపై సమాచారం అందుకున్న సుబేదారి పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించగా అప్పటికే మృతిచెందాడు. భరత్‌ ఎంతకూ రాకపోవడంతో అతనికి సాయినికేతన్‌ ఫోన్‌ చేయగా లిఫ్ట్‌ చేసిన పోలీసులు భరత్‌ మృతిచెందాడని సమాచారం ఇచ్చారు. కాగా, భరత్‌ బైక్‌పై వస్తూ లైబ్రరీ వద్ద డివైడర్‌ ఢీకొనగా ప్రఽమాదం జరిగిందా? లేదా వేరే వాహనం ఏమైనా ఢీకొందా అనే విషయంపై ఆ ప్రాంతంలోని సీసీ ఫుటేజీ పరిశీలించనున్నట్లు సుబేదారి ఎస్సై లక్ష్మి తెలిపారు. బుధవారం ఎంజీఎంలో భరత్‌ మృతదేహానికి పోస్టుమార్టం చేసి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై లక్ష్మి తెలిపారు. ఇదిలా ఉండగా మృతదేహం వద్దకు ఇంజనీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఎన్‌.రమణ, హాస్టళ్ల జాయింట్‌ డైరెక్టర్‌ దయాకర్‌ చేరుకుని తల్లిదండ్రులు, బంధువులతో మాట్లాడారు. మృతదేహాన్ని స్వగ్రామం తరలించేందుకు అంబులెన్స్‌ ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపాల్‌ రమణ తెలిపారు. భరత్‌ మృతితో తల్లిదండ్రులకు శోకసముద్రంలో మునిగిపోయారు.

రోడ్డు ప్రమాదంలో ఇంజనీరింగ్‌ విద్యార్థి దుర్మరణం

స్నేహితుడిని రక్తదానం చేయించేందుకు వేరే వ్యక్తి బైక్‌పై బ్లడ్‌బ్యాంకుకు..

బైక్‌ ఇచ్చి వస్తానని బయలుదేరిన భరత్‌.. హనుమకొండ పబ్లిక్‌ గార్డెన్‌ సమీపంలో ప్రమాదం

మృతుడు సూర్యాపేట జిల్లావాసి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement