పరకాల: బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు రజాకార్ల వారసత్వ పార్టీ ఎంఐఎంపై ఉన్న అభిమానం.. తెలంగాణ ప్రజలపై ఏమాత్రమూ లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు అన్నారు. ఆ రెండు పార్టీలు ఎంఐఎంకు రెండు కోరలని, వాటిని పీకేస్తే తెలంగాణ ప్రజలకు నిజమైన స్వాతంత్య్రం సిద్ధిస్తుందన్నారు. 1948, సెప్టెంబర్ 2న పరకాల చాపలబండ వద్ద జరిగిన దక్కన్ జలియన్వాలాబాగ్ ఘటనను స్మరించుకుంటూ స్థానిక అమరధామంలో అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావుతోపాటు మాజీ ఎంపీ బూర నర్సయ్య, రాష్ట్ర నాయకులు హాజరయ్యారు. ముందుగా రాంచందర్రావు, రాష్ట్ర నాయకులకు బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. అమరధామం వద్ద తెలంగాణ అమరవీరుల సేవలను స్మరించుకున్నారు. స్వాతంత్య్ర సమరయోధుల సతీమణులను సన్మానించారు. ఈ సందర్భంగా రాంచందర్రావు మాట్లాడుతూ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అఽధికారికంగా నిర్వహించడంతోపాటు ప్రభుత్వ పాఠ్యపుస్తకాల్లో పాఠ్యాంశంగా చేర్చాలని డిమాండ్ చేశారు. మరో రెండేళ్లలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, అప్పుడు తెలంగాణ ప్రజలంతా గర్వపడేలా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వ పాఠ్యపుస్తకాల్లో విమోచన దినోత్సవం ప్రాధాన్యతను చేర్చి భావితరాలకు తెలియజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పి.కాళీప్రసాద్రావు, డాక్టర్ పెసరు విజయ్చందర్రెడ్డి, డాక్టర్ సిరంగి సంతోష్కుమార్, రావు పద్మ, జిల్లా, పట్టణ నాయకులు పాల్గొన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
రాంచందర్రావు మండిపాటు
పరకాల అమరధామంలో తెలంగాణ అమరవీరులకు నివాళి


