హన్మకొండ చౌరస్తా: అధికారం కోల్పోయామన్న అక్కసుతోనే బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై పదేపదే విమర్శలు చేస్తున్నారని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య విమర్శించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి ప్రతిపక్ష బాధ్యతను సమర్థంగా నిర్వర్తించాలని సూచించారు. బుధవారం హనుమకొండ డీసీసీ కార్యాలయంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్రెడ్డితో కలిసి ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలోనే అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో అనేక కార్యక్రమాలు చేపట్టిందని కావ్య తెలిపారు. ‘చెప్పినవి చేస్తున్నాం.. చెప్పనివి కూడా చేస్తున్నాం. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనే మా ప్రోగ్రెస్ రిపోర్ట్’ అని ఆమె పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆరు గ్యారంటీల అమలుతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని తెలిపారు. తెలంగాణ ఉద్యమం సమయంలో విద్యార్థులను ఉపయోగించుకున్న బీఆర్ఎస్.. అధికారంలోకి వచ్చిన తర్వాత వారి భవిష్యత్ కోసం ఏం చేసిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వర్సిటీలకు వీసీల నియామకాలు చేపట్టిందని, పాఠశాలల అభివృద్ధికి చర్యలు తీసుకుందని తెలిపారు. డీఎస్సీ ద్వారా సుమారు 10 వేల మంది ఉపాధ్యాయులను నియమించినట్లు, వివిధ శాఖల్లో సుమారు 70 వేల ఉద్యోగాలు భర్తీ చేసినట్లు ఆమె పేర్కొన్నారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎంపీ కావ్య పేర్కొన్నారు.
కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనే మా ప్రోగ్రెస్ రిపోర్ట్
ఎంపీ కడియం కావ్య


