వరంగల్ సిటీ క్రైమ్ స్టేషన్ ఏసీపీ పి.సదయ్య
హన్మకొండ: బాలల అభివృద్ధికి అటంకం కలిగించే వారిపై చర్యలు తప్పవని, చట్ట ప్రకారం శిక్షలు పడేలా చూస్తామని వరంగల్ సిటీ క్రైం స్టేషన్ ఏసీపీ పి.సదయ్య అన్నారు. బుధవారం హనుమకొండ సుబేదారిలోని అసుంత భవన్లో ఎఫ్ఎంఎం సాంఘిక సేవా సంస్థ, వరంగల్ పోలీస్ కమిషనరేట్ యాంటీ హ్యూమన్ ట్రాకింగ్ యూనిట్ ఆధ్వర్యంలో పోలీస్, ఇతర శాఖల అధికారులకు మానవ అక్రమ రవాణ నిర్మూలన, బాలలపై హింసను నిరోధించడంపై శిక్షణ నిర్వహించారు. ఏసీపీ పి.సదయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. జూలైలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ పరిస్థితుల్లో ఉన్న బాలలు, బాల కార్మికులు, చదువు మానేసిన, భిక్షాటన చేసే, వివిధ రకాలుగా హింసకు, దోపిడి గురైన 314 బాలలను రిస్క్ చేసి వారిని సంరక్షించినట్లు తెలిపారు. ఈసందర్భంగా జూలైలో ఆపరేషన్ ముస్కాన్లో రెస్క్యూ చేసి బాలలను రక్షించిన పోలీసు, ఇతర శాఖల అధికారులకు ప్రశంస పత్రాలు అందించారు. ఎఫ్ఎంఎం సాంఘిక సేవా సంస్థ డైరెక్టర్ సిస్టర్ సహాయ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఇన్స్పెక్టర్ రమేశ్, వరంగల్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ కె.వసుధ, జనగామ సీడబ్ల్యూసీ చైర్పర్సన్ ఉప్పలయ్య, ఆయా సంస్థల ప్రతినిధులు ఫాదర్ కోసి, డాక్టర్ ఆనంద్, ఎఫ్ఎంఎం సాంఘిక సేవా సంస్థ కో–ఆర్డినేటర్స్ ఎర్ర శ్రీకాంత్, బత్తుల కరుణ, సిబ్బంది ఇక్బాల్ పాపా, ఎం.అజయ్ కుమార్ పాల్గొన్నారు.


