● హనుమకొండ అదనపు కలెక్టర్ రవి
● ప్రజావాణిలో 275 దరఖాస్తులు స్వీకరణ
హన్మకొండ అర్బన్: ప్రజావాణిలో స్వీకరించిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని హనుమకొండ అదనపు కలెక్టర్ ఎన్.రవి అధికారులను అదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ శేషాద్రి, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస్తో కలిసి ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్ రవి మాట్లాడుతూ.. దరఖాస్తులు పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. జిల్లా, ఆర్డీఓ, ఎంపీడీఓ కార్యాలయాల్లో నిర్వహించిన ప్రజావాణిలో మొత్తం 275 దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీఓ మేన శ్రీను, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అప్పయ్య, ఇతర శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి
న్యూశాయంపేట: ప్రజావాణిలో అందించే దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని వరంగల్ అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) వైవీ గణేశ్ తెలిపారు. వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశాల మేరకు కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వినతులు సత్వరమే పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో మొత్తం 136 దరఖాస్తులు రాగా ఆయా శాఖల అధికారులకు ఎండార్స్ చేశారు. వరంగల్ రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో రెండు దరఖాస్తులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, డీఆర్డీఓ నాగపద్మజ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
వినతులు ఇలా..
● నా వాటాకు సంబంధించిన భూమిని అత్తామామ, మరిది కుమారులు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఖిలావరంగల్ మండలం వసంతాపూర్కు చెందిన కె. కవిత వినతిపత్రం అందించారు.
● వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధి 37, 38 డివిజన్ పరిధి ఖిలావరంగల్ పడమర కోట ప్రాంతంలో తాగునీటి ఎద్దడిని నివారించాలని అఖిల పక్ష పోరాట కమిటీ ఆధ్వర్యంలో విన్నవించారు.
● ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని 16వ డివిజన్కు చెందిన గొర్రె అరుణ కోరారు.
● హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం రెడ్డిపాలేనికి ఎనిమిది నెలల నుంచి గ్యాస్ సరఫరా కావడం లేదని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు.


