సాక్షి, వరంగల్: వరంగల్ జిల్లాలో చేయూత కొత్త పింఛన్ల కోసం మొత్తం 12,347 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో వితంతువులవి 6,954, ఒంటరి మహిళలు 634, దివ్యాంగులు 3,286, చేనేత కార్మికులు 343, కల్లు గీత కార్మికులు 1,130 దరఖాస్తులు ఉన్నాయి. అయితే దరఖాస్తుల స్వీకరణకు ఆగస్టు 31న ఆఖరు అయినా మళ్లీ ప్రభుత్వం ఈనెల 15వ తేదీ వరకు గడువు పొడిగించడంతో మరికొందరికి ఊరట దక్కినట్లయింది. పూర్తిగా నింపిన నూతన దరఖాస్తు ఫారంతో పాటు అభ్యర్థి జత చేయాల్సిన ధ్రువీకరణ పత్రాలు తెచ్చుకోవడంతో ఆయా దరఖాస్తులకు ఎదురువుతున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని పొడిగింపు నిర్ణయం తీసుకోవడంతో హర్షం వ్యక్తమవుతోంది.
తాళం వేసి ఉన్న ఇళ్లే టార్గెట్..
ఖిలా వరంగల్ : జల్సాలు, తాగుడుకు బానిసై తాళం వేసి ఉన్న ఇళ్లే టార్గెట్గా చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఏనుమాముల ఇన్స్పెక్టర్ జవ్వాజి సురేశ్ తెలిపారు. ఈ మేరకు సోమవారం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్సై గోవర్ధన్తో కలిసి వివరాలు వెల్లడించారు. ఇటీవల దుండగులు ఆరెపల్లి గ్రామంలో తాళం వేసి ఉన్న ఇంట్లోకి ప్రవేశించి బీరువా పగుల గొట్టి అందులో ఉన్న 15 గ్రాముల బంగారం, రూ.10వేల నగదు చోరీ చేశారు. బాధితురాలు ఎదులాపురం మంజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం ఆరెపల్లి వద్ద రహదారిపై ఎస్సై గోవర్ధన్ ఆధ్వర్యంలో సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో ఎంహెచ్నగర్కు చెందిన ఊరడి అభిలాశ్, ఇసెంపల్లి లోకేశ్ ఆటోలో అనుమానాస్పదంగా కనిపించారు. వారిని వెంబడించి పట్టుకుని విచారించగా చోరీలకు పాల్పడుతున్నట్లు ఒప్పుకున్నారు. దీంతో అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.


