హన్మకొండ చౌరస్తా: ‘నీ వెకిలి చేష్టలతో స్థాయి మరిచి సీఎంపై మాట్లాడుతున్నావు. కర్మకాలి నువ్వు హనుమకొండకు వస్తే నీ గుండు గీయిస్తా బిడ్డా’ అంటూ నిజామబాద్ ఎంపీ అర్వింద్పై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హనుమకొండలోని డీసీసీ భవన్లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘పీసీసీ చీఫ్గా మీ నాన్న ఉన్నప్పుడు మీరు బ్లాక్ టికెట్లు అమ్మారు.. మరిచిపోయారా’ అని ప్రశ్నించారు. రామాలయాన్ని రూ.2 కోట్లకు కొని రూ.16 కోట్లకు అమ్ముకున్న చరిత్ర, పేపర్ల లీకేజీతో దోచుకున్న చరిత్ర బీజేపీదే అన్నారు. ఉద్యోగులకు సంఘీభావం తెలిపేందుకు హనుమకొండకు హరీశ్ రావడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సిద్దిపేటను బాగు చేసుకోవడానికి వరంగల్ను నాశనం చేసింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్ వచ్చి అండర్గ్రౌండ్ డ్రెయినేజీ అన్నరు.. పోయిండ్లు, ఇప్పుడేమో దొంగ ఏడుపులు, సింపతి కోసం ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతిని ప్రశ్నించినందుకు తనపై 54 కేసులు బనాయించారన్నారు. నగరాభివృద్ధిపై బీజేపీ, బీఆర్ఎస్ నేతలు చర్చకు రావాలని సవాల్ విసిరారు. సమావేశంలో టీపీసీసీ కార్యదర్శి బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీపీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాసరావు, నాయకులు డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ, అర్శం అశోక్, బంక సరళ, రహిమున్నీసా తదితరులు పాల్గొన్నారు.
బ్లాక్ టికెట్లు అమ్ముకున్న చరిత్ర మీదే
ఉద్యోగులకు హరీశ్ సంఘీభావం
తెలపడం హాస్యాస్పదం
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే
నాయిని రాజేందర్రెడ్డి


