కాళేశ్వరం: జయశంకర్భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారి ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా మంగళవారం ఆలయ పాత గర్భగుడిని కూల్చివేశారు. మంత్రి శ్రీధర్బాబు ఆధ్వర్యంలో ఆలయ అభివృద్ధి, పునర్నిర్మాణ పనులను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతుందని ఆలయ చైర్మన్ మోహన్శర్మ అన్నారు. ఆర్అండ్బీ డీఈఈ దేవేందర్, నిపుణుల సూచనలతో పాత గర్భగుడిని తొలగించినట్లు ఈఓ మహేశ్ పేర్కొన్నారు.
పెద్దరాళ్ల తొలగింపు..
గర్భగుడిని పెద్ద రాళ్లు, ఇనుము, మట్టి, సిమెంట్ ఇటుకలతో నిర్మాణం చేయగా తొలగించారు. 11వ శతాబ్దంలో కాకతీయులు, చాళుక్యుల కాలం నాటి ఆలయానికి అప్పటి రవాణాశాఖ మంత్రి జువ్వాడి చొక్కారావు 1978 నుంచి 1982లో జీర్ణోద్దరణ చేసి కుంభాభిషేకం నిర్వహించిన విషయం తెలిసిందే. శ్రీకాళేశ్వరముక్తీశ్వరుల లింగాలకు ఎలాంటి ప్రమాదం లేకుండా పైనుంచి ఇనుప కప్పు ఏర్పాటు చేసి జాగ్రత్తగా పాత గర్భగుడిని తొలగించారు. ద్విలింగాలకు ఆనుకుని ఉన్న మిగిలిన నాలుగు స్తంభాలను యంత్రాలతో కాకుండా మనుషులతో తొలగించనున్నారు. దీంతో పూర్తిగా తొలగింపు ప్రక్రియ ముగియనుంది.


