బీఏఎంఎస్‌ అడ్మిషన్లకు లైన్‌ క్లియర్‌! | - | Sakshi
Sakshi News home page

బీఏఎంఎస్‌ అడ్మిషన్లకు లైన్‌ క్లియర్‌!

Aug 19 2026 12:42 AM | Updated on Aug 19 2026 12:42 AM

బీఏఎంఎస్‌ అడ్మిషన్లకు లైన్‌ క్లియర్‌!

వరంగల్‌ ఆయుర్వేద కళాశాలలో ఆయుష్‌ సీట్లు పదిలం

కండీషన్‌ అఫిడవిట్‌తో అంగీకరించిన ఎన్‌సీఐఎస్‌ఎం

2026–2027 వైద్యవిద్య ప్రవేశాల అభ్యర్థులకు అవకాశం

కాశిబుగ్గ: వరంగల్‌ లేబర్‌కాలనీలోని అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో ఆయుష్‌ (బీఏఎంఎస్‌) అడ్మిషన్లకు లైన్‌ క్లియర్‌ అయినట్లు తెలుస్తోంది. 2026–2027లో వైద్యవిద్య ప్రవేశాలకు సంబంధించిన సీట్ల భర్తీ కోసం డోకా లేనట్లు సమాచారం. ఢిల్లీలోని నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ ఇండియన్‌ సిస్టం ఆఫ్‌ మెడిసిన్‌ (ఎన్‌సీఐఎస్‌ఎం) హెల్త్‌ సెక్రటరీ తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల మేరకు కళాశాలలో ఉన్న 50 జనరల్‌ సీట్లతో పాటు 13 ఈడబ్ల్యూఎస్‌ సీట్లు కలిపి మొత్తం 63 బీఏఎంఎస్‌ సీట్లను భర్తీ చేసుకోవడానికి అవకాశం ఏర్పడింది. నీట్‌ ద్వారా బీఏఎంఎస్‌ కోర్సులో చేరడానికి మార్గం సుగమం కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, అధ్యాపకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

గత ఏడాది 12 సీట్లకు కోత..

కళాశాలలోని అధ్యాపకులు, ఇతర సౌకర్యాలను లేమిగా చూపుతూ గత సంవత్సరం 12 సీట్లకు కోత పెట్టారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సకాలంలో సదుపాయాలు కల్పించకపోవడం వల్ల సీట్లను కోల్పోవాల్సి వచ్చిందని నిరసన తెలిపారు. దీంతో వచ్చే విద్యా సంవత్సరానికి ఫ్యాకల్టీతో పాటు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామని అప్పుడు కండీషన్‌ అఫిడవిట్‌ ఇవ్వడంతో సీట్లను యథావిధిగా భర్తీ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఈ విద్యా సంవత్సరం వరకు ఫ్యాకల్టీతోపాటు ఎలాంటి సదుపాయాలు కల్పించలేదు. ఈ ఏడాది ఏప్రిల్‌లో తనిఖీ కోసం వచ్చిన ఉన్నతాధికారులు సౌకర్యాల లేమి చూపినట్లు తెలుస్తోంది.

అవసరమైన సదుపాయాలు..

2024 గెజిట్‌ ప్రకారం 30 మంది నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ ఉండాలి. ఈ ఏడాది మరో 50 మందిని పెంచారు. అలాగే, టీచింగ్‌ స్టాఫ్‌ 60 మంది ఉండాలి. మరో 30 మందిని అదనంగా పెంచినట్లు తెలుస్తోంది. దీంతో మొత్తం 80 మందిని నియమించడం సాధ్యంకాని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే కళాశాలలో 40 శాతం వరకు ఖాళీలు ఉన్నట్లు సమాచారం.

మళ్లీ కండీషన్‌ అఫిడవిట్‌..!

ఆయుష్‌ విద్యార్థులు నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం గతంలో మాదిరిగా ఈసారి కూడా కండీషన్‌ అఫిడవిట్‌ తీసుకున్నట్లు సమాచారం. 31 జనవరి 2027లోపు పూర్తిస్థాయిలో ఫ్యాకల్టీతో పాటు సౌకర్యాలు కల్పిస్తామని అండర్‌ టేకింగ్‌ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం కూడా ఈడబ్ల్యూఎస్‌ కలుపుకుని 63 ఆయుష్‌ సీట్లు భర్తీ చేసే అవకాశం ఏర్పడింది. కండీషన్‌ అఫిడవిట్‌కు ఎన్‌సీఐఎస్‌ఎం అంగీకరించినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement