● అనుమతి లేని వాణిజ్య ఫ్లెక్సీలు, కటౌట్లపై క్రిమినల్ కేసులు
● ఫ్లెక్సీ తయారీదారుల సమావేశంలో బల్దియా కమిషనర్ వెంకన్న
వరంగల్ అర్బన్: నగరంలో అనుమతి లేకుండా కమర్షియల్ ఫ్లెక్సీలు, కటౌట్లను ముద్రించినా, అనధికారికంగా ఏర్పాటు చేసినా క్రిమినల్ కేసులు తప్పవని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి.వెంకన్న హెచ్చరించారు. బల్దియా కార్యాలయంలోని ఫ్లెక్సీ తయారీదారులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ముందస్తుగా అనుమతి తీసుకున్న తర్వాతనే ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. నగరంలోని ఫ్లెక్సీ తయారీదారులతో ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి నిబంధనలు చేరవేస్తామని తెలిపారు. నగర సుందరీకరణకు సహకరించాలని కోరారు. జిల్లా అగ్నిమాపక అధికారి శంకర్లింగం, సిటీప్లానర్ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నరాణి, సమ్మయ్య, స్టేషన్ ఫైర్ఆఫీసర్ రాజేశ్వర్రావు, శానిటరీ సూపర్వైజర్ గోల్కొండ శ్రీను తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా కమిషనర్ జన్మభూమి జంక్షన్లో పారిశుద్ధ్య పనులు తనిఖీ చేశారు. ఎస్ఈ రాజ్కుమార్, ఎంహెచ్ఓ రాజేశ్, ఈఈ రవికుమార్, శానిటరీ సూపర్వైజర్లు నరేందర్, గోల్కొండ శ్రీను, డీఈ రాజ్కుమార్, ఎస్ఐ భీమయ్య ఉన్నారు. పారిశుద్ధ్య నిర్వహణపై అధ్యయనం చేసేందుకు చైన్నెలోని స్వామినాథన్ పరిశోధనా సంస్థ బృందం కమిషనర్ టి.వెంకన్నతో సమావేశమైంది.


