● 16న ఉమ్మడి వరంగల్లో పర్యటన..
● ములుగు కలెక్టరేట్ ప్రారంభం.. గట్టమ్మ వద్ద పైలాన్ ఆవిష్కరణ
● పరకాలలో ‘యంగ్ ఇండియా’కు
శంకుస్థాపన.. అనంతరం బహిరంగ సభ
సాక్షి ప్రతినిధి, వరంగల్: రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి ఈ నెల 16న ఉమ్మడి వరంగల్లో పర్యటించనున్నారు. ములుగు, హనుమకొండ జిల్లాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. పర్యటనలో భాగంగా ములుగు జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన ‘ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్’ సముదాయాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం గట్టమ్మ గుడి వద్ద ఏర్పాటు చేసే పైలాన్ వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ మేరకు ఉన్నతాధికారులు, కీలక ప్రజాప్రతినిధులకు సీఎంఓ నుంచి శుక్రవారం అధికారిక సమాచారం అందినట్లు తెలిసింది. అక్కడినుంచి పరకాలకు చేరుకోనున్న సీఎం రేవంత్.. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. వంద పడకల సివిల్ ఆస్పత్రి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనాలను ప్రారంభిస్తారు. చివరగా పరకాలలో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా జిల్లాల వారీగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, భవిష్యత్లో చేపట్టనున్న పనులపై సీఎం మాట్లాడే అవకాశం ఉంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లపై దృష్టి సారించారు.
ఏర్పాట్ల పరిశీలన..
పరకాల: ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పరకాలలో చేపడుతున్నట్లు ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి శుక్రవారం అధికారులతో కలిసి పరిశీలించారు. స్థానిక పశువుల సంతలో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభాస్థలిని సందర్శించారు. వేదిక, సభా ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు.


