హనుమకొండ ఇన్చార్జ్ కలెక్టర్ ఎన్.రవి
హన్మకొండ అర్బన్: జిల్లాలో ఈనెల 15 నుంచి స్మార్ట్ రేషన్కార్డుల పంపిణీ ప్రారంభం కానుందని హనుమకొండ ఇన్చార్జ్ కలెక్టర్ ఎన్.రవి తెలిపారు. కలెక్టరేట్లోని పౌరసరఫరాల శాఖ కార్యాలయానికి చేరుకున్న కార్డులను శుక్రవారం ఆయన పరిశీలించి, పంపిణీ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. జిల్లాలోని 14 మండలాలకు 2,56,838 స్మార్ట్ రేషన్కార్డులు చేరినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఇన్చార్జ్ కలెక్టర్ రవి మాట్లాడుతూ ప్రతి రేషన్ షాపు పరిధిలో లబ్ధిదారులకు కార్డులు సులభంగా, పారదర్శకంగా అందేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పంపిణీ ప్రక్రియను సమన్వయం చేసేందుకు ప్రతి మండలానికి నోడల్ అధికారులను నియమించనున్నట్లు తెలిపారు. జిల్లా పౌరసరఫరాల అధికారి మహేందర్, డీటీలు, సిబ్బంది పాల్గొన్నారు.
సీఈఓకు పోలింగ్ కేంద్రాల
రేషనలైజేషన్ ప్రతిపాదనలు
జిల్లాలో పోలింగ్ కేంద్రాల మార్పు, సర్దుబాటు, ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లను ఒకే పోలింగ్ కేంద్రానికి మార్చేందుకు రూపొందించిన రేషనలైజేషన్ ప్రతిపాదనలను ఈనెల 10న రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి సమర్పించనున్నట్లు ఇన్చార్జ్ కలెక్టర్ ఎన్.రవి తెలిపారు. కలెక్టరేట్లో అధికారులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో పలు కారణాలతో 14 పోలింగ్ కేంద్రాలను సమీపంలోని అనువైన భవనాలకు మార్చేందుకు ప్రతిపాదించారు. 1,200 మందికి పైగా ఓటర్లు ఉన్న రెండు పోలింగ్ కేంద్రాలను సమీప కేంద్రాల్లో సర్దుబాటు చేయాలని నిర్ణయించారు.


