హన్మకొండ కల్చరల్: మాసశివరాత్రిని పురస్కరించుకొని రుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలో ఆదివారం ప్రత్యేక పూజ లు, శివకల్యాణం నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు ఉదయం ఐదు గంటల నుంచి ప్రభాతసేవ, ఉత్తిష్టగణపతికి ఆరాధన గరికపూజ, శ్రీరుద్రేశ్వరుడికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, సామూహిక రుద్రాభిషేకాలు చేశారు. అనంతరం నాట్య మండపంలో వేదపండితుడు వెంకటేశ్వరశర్మ, అర్చకులు రుద్రేశ్వరిదేవి, రుద్రేశ్వరస్వామి వారిని ప్రతిష్ఠించారు. కలశస్థాపన, బాసికధారణ, యజ్ఞోపవీతధారణ, పాదప్రక్షాళన, జీలకర్రబెల్లం, మాంగల్యధారణ, అక్షతారోహణ, మహాహారతి జరిపి రుద్రేశ్వరిదేవి, రుద్రేశ్వరస్వామి వార్లకు కల్యాణోత్సవం నిర్వహించా రు. కల్యాణోత్సవంలో బీజేపీ సీనియర్ నాయకులు రావు అమరేందర్రెడ్డి పాల్గొన్నారు.
వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కమిషనర్ టి.వెంకన్న ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అధికారులకు దరఖాస్తులను అందజేయాలని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారం కోసం అధికారులకు ఆదేశాలు ఇస్తామని, గ్రీవెన్స్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ కోరారు.
వరంగల్ కలెక్టరేట్లో..
న్యూశాయంపేట: వరంగల్ కలెక్టరేట్లో నేడు (సోమవారం) ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ సత్యశారద ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎస్ఐఆర్ నిర్వహణలో భాగంగా డివిజన్ స్థాయిలో నిర్వహించే ప్రజావాణిని రద్దు చేశామన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
కాశిబుగ్గ: వరంగల్ మహాత్మాగాంధీ స్మారక వైద్యశాల (ఎంజీఎం)తో పాటు సీకేఎం ప్రసూతి ఆస్పత్రిలో డైటీషియన్ పోస్టులు భర్తీ కావడం లేదు. ఇక్కడ పనిచేసిన డైటీషియన్లు బదిలీ అయి నెలరోజులు కావొస్తున్నా కొత్తవారు రావడం లేదు. ఎంజీఎంలో డైటీషియన్గా పనిచేసిన రవీందర్రెడ్డి హైదరాబాద్లోని నిలోఫర్ ఆస్పత్రి, సీకేఎంలో డైటీషియన్గా పనిచేసిన ఏఈ గ్రేస్ నర్సంపేటలోని ప్రభుత్వ ఆస్పత్రికి బదిలీ అయ్యారు. అయితే, వీరి స్థానంలో ఇంకా ఎవరిని నియమించలేదు. ఉన్నతాధికారులు నూతన డైటీషియన్లను నియమించాలని పలువురు కోరుతున్నారు.
విద్యారణ్యపురి: బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ఆర్డీఎస్డీఈ సంయుక్త ఆధ్వర్యంలో హనుమకొండ ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో ఈనెల 13 (సోమవారం)న అప్రెంటిస్షిప్ జాబ్మేళా నిర్వహించనున్నట్లు ఇంటర్ విద్య ఆర్జేడీ ఎ.గోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. 2023–2026 విద్యాసంవత్సరాల మధ్య ఇంటర్ ఒకేషనల్ కోర్సుల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ జాబ్మేళాకు హాజరుకావాలని పేర్కొన్నారు. ఉదయం 10 గంటలకు పారామెడికల్ కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులు, మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాన్ పారామెడికల్ కోర్సులు పూర్తిచేసిన వారికి జాబ్మేళా నిర్వహించనున్నట్లు చెప్పారు. ఎంపికై న వారికి నెలకు రూ 9,600 స్టైఫండ్ రూపంలో చెల్లిస్తారని, పలు ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేట్ రంగసంస్థలు అభ్యర్థుకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాయని పేర్కొన్నారు. అభ్యర్థులు తమ బయోడేటా, విద్యార్హతల ధ్రువీకరణ పత్రాలు, ఆధార్కార్డు, పాస్పోర్ట్సైజ్ ఫొటోలతో హాజరుకావాలని ఆయన సూచించారు.
కాశిబుగ్గ/ఖిలావరంగల్: వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ప్రత్యేక సమగ్ర ఓటరు సవరణ ప్రక్రియను కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదివారం పరిశీలించారు. ఈ మేరకు శంభునిపేట, పడమరకోట, కొత్తవాడ, బ్యాంకు కాలనీలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి బూత్ లెవల్ అధికారుల పనితీరును పరిశీలించారు. ఓటర్ల నుంచి దరఖాస్తులను నిబంధనల ప్రకారం స్వీకరించాలని, ఓటు హక్కు కలిగిన ప్రతీఒక్కరి వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లోకల్ బాడీ అదనపు కలెక్టర్ వైవీ గణేశ్, డీబీసీడీఓ పుష్పలత, తహసీల్దార్లు శ్రీకాంత్, ఇక్బాల్, అధికారులు పాల్గొన్నారు.


