మంత్రుల రాక కోసం ఏర్పాట్లు..
నేడు దేవాదులకు
కన్నాయిగూడెం/ములుగు రూరల్: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం గ్రామ పంచాయతీలోని గుట్టలగంగారం పరిధిలో ఉన్నా దేవాదుల జె.చొక్కారావు ఎత్తిపోతల ప్రాజెక్టుకు రాష్ట్ర ఉపముఖ్య మంతి భట్టి విక్రమార్క, భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సోమవారం రానున్నారు. ఉదయం 9 గంటలకు హైదరాబాద్లోని బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి దేవాదులకు చేరుకోనున్నారు. అక్కడ పంపింగ్ చేస్తున్న విధానం, పంపుల పని విధానం, సమ్మక్క–సాగర్ బ్యారేజీ స్టోరేజీ తదితర వివరాలను తెలుసుకోనున్నారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం. కాగా, ఫిబ్రవరిలో రాష్ట్ర ముఖ్యమంతి రేవంత్రెడ్డి దేవాదులను సందర్శించారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు పూర్తి పంపింగ్, మిగిలిన పనులను ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. వెంటనే పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఇందులో భాగంగానే సోమవారం డిప్యూటీ సీఎం, ఇరిగేషన్ మంత్రి దేవాదులకు వస్తున్నట్లు తెలుస్తోంది.
కన్నాయిగూడెం నీటికష్టాలు తీరేనా?
తలాపున గోదావరి ఉన్నా ఈ కన్నాయిగూడెం మండల ప్రాంత ప్రజలకు నీటి కష్టాలు తీరడంలేదు. మండలంలో అతి పెద్ద ప్రాజెక్టు దేవాదుల ప్రాజెక్టు ఉన్నా చుక్కనీరు ఈ ప్రాంత ప్రజలకు రావడం లేదు. దేవాదుల నుంచి ప్రత్యేక కాల్వ ఏర్పాటు చేసి మండలంలో ఉన్న చెరువులు, కుంటలను నింపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటివరకు అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోలేని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి నుంచి నీటిని తోడి వంద కిలోమీటర్లు దూరానికి తరలించి సాగు నీరు, తాగు నీరు అందిస్తున్నారు. ఇక్కడి ప్రాంత ప్రజలకు మాత్రం చుక్కనీరు ఇవ్వడం లేదు. దీంతో మండలంలోని ఏజెన్సీ ప్రాంతాలకు వర్షాలు పడితే తప్ప పంటలు పండే పరిస్థితి లేదు. రాష్ట్ర మంత్రులు దృష్టి పెట్టి కన్నాయిగూడెం మండలానికి దేవాదుల నుంచి సాగు, తాగునీరు అందించాలని ప్రజలు కోరుతున్నారు.
రాష్ట్ర ఉపముఖ్యమంతి, ఆర్థిక శాఖ, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క, భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి సోమవారం దేవాదుల పర్యటనను పురస్కరించుకొని ఇరిగేషన్, అధికారులు, రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. కావాల్సిన వసతులు, టెంట్లు, భద్రతను సిద్ధం చేస్తున్నారు. దేవాదుల ప్రాంతాన్ని పూర్తిగా అధికారుల ఆధీనంలోకి తీసుకున్నారు.
నీటి పంపింగ్, మిగిలిన పనులపై అధికారులతో సమీక్ష
ఏర్పాట్లు చేస్తున్న పోలీసు, రెవెన్యూ,
నీటిపారుదల శాఖ


