జనగామ: జనగామ జిల్లా తరిగొప్పుల పోలీస్ స్టేషన్ ఎదుట రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్ప డిన ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జనగామ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో బాధితుడు రాజు విలేకరులకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కొంతకాలంగా గ్రామంలోని పలువురితో భూ వివాదం కొనసాగుతోందని, ఈ విషయమై పలుమార్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా తనకు న్యాయం జరగలేదన్నాడు. ఇటీవల జరిగిన ఘర్షణలో తాను గాయపడి వరంగల్లో చికిత్స పొందానని తెలిపాడు. తాను ఆస్పత్రిలో ఉన్న సమయంలో పోలీసులు ప్రత్యర్థి వర్గంతో మా త్రమే విచారణ నిర్వహించారని, తన పిటిష న్ను ఎస్సై శ్రీదేవి పట్టించుకోలేదనే ఆవేదనతో పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు చెప్పాడు. ఈ ఆరోపణలను తరిగొప్పుల ఎస్సై శ్రీదేవి ఖండించారు. భూ వివాదానికి సంబంధించిన ఘటనలో రాజు ఓ వృద్ధుడిపై దాడి చేసి గాయపరిచాడని, అతడిపై గతంలో కూడా పలు కేసులు నమోదై ఉన్నాయని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదైందని తెలుసుకుని అనవసర ఆరోపణలు చేస్తున్నారన్నారు. రాజు పిటిషన్ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం జరగలేదని, పోలీస్స్టేషన్కు వచ్చిన సమయంలో జరిగిన వ్యవహారానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు తమ వద్ద ఉన్నాయని చెప్పారు. రాజు పురుగుల మందు తాగలేదని, బయటనే ఒంటిపై పోసుకున్న సమయంలో పోలీసులు అడ్డుకొని ఆస్పత్రికి తరలించారని వివరించారు. చికిత్స అందిస్తున్న వైద్యుడు మహేశ్ మాట్లాడుతూ బాధితుడు పురుగుల మందు తాగినట్లు చెబుతున్నప్పటికీ ఏ మందు తాగాడనే ఆధారాలు లేవని, సంబంధిత డబ్బా కూడా తీసుకురాలేదన్నారు. ప్రస్తుతం చికిత్స అందిస్తున్నామని, రాజు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. ఈ ఘటనపై ఇంటెలిజెన్స్ వర్గాలు సైతం ఆరా తీస్తున్నాయి. ఎస్సై పట్టించుకోకపోవడం వల్లే ఆత్మహత్య ఒక్కటే శరణ్యంగా భావించానని రైతు చెబుతుండగా, అలాంటిది ఏం లేదని ఎస్సై చెబుతున్న వాదన.. రెండింట్లో ఎవరిది నిజమో పూర్తి విచారణ తర్వాత వెల్లడి కానుంది.
జనగామ జిల్లా తరిగొప్పుల పీఎస్ ఎదుట ఘటన
భూ వివాదమే కారణమని రైతు ఆరోపణ
ఖండించిన ఎస్సై


