ఆకాశంనుంచి నగర సర్వే.. ప్రతీ ఆస్తి కంప్యూటర్లోకి..
● పన్ను వసూళ్లనుంచి స్మార్ట్ సిటీ వరకు.. ఒకే డిజిటల్ మ్యాప్లోకి..
● కార్పొరేషన్కు పెరగనున్న ఆదాయం
● హైదరాబాద్ మోడల్ ఇప్పుడు వరంగల్లో..
● డ్రోన్, ఏఐ, 3డీ డేటాబేస్తో కొత్త అధ్యాయం
● మొదటగా రూ.10 కోట్లు విడుదల
సాక్షిప్రతినిధి, వరంగల్ :
గ్రేటర్ వరంగల్ నగరాన్ని అత్యాధునిక డిజిటల్ టెక్నాలజీతో అనుసంధానించే భారీ ప్రాజెక్టుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నగరంలోని ప్ర తీ ఇల్లు, భవనం, స్థలం రోడ్డు, డ్రెయినేజీ, తాగునీటి పైప్లైన్ను డిజిటల్గా నమోదు చేసి ఒకే మ్యా ప్లోకి తీసుకురానున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అమృత్–2.0 పథకం కింద రూ.10 కోట్ల పరి పాలనా అనుమతి మంజూరు చేసింది. డ్రోన్ ఆధారిత ప్రాపర్టీ ట్యాక్స్ మ్యాపింగ్, సమగ్ర జీఐఎస్ (జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టం), 3డీ డిజిటల్ అర్బన్ డేటాబేస్ రూపొందించే ఈ ప్రాజెక్టుకు సంబంధించి శుక్రవారం జీఓను జారీ చేసింది.
కేవలం ఆస్తిపన్ను సర్వే కాదు..
భవిష్యత్ డిజిటల్ బ్లూ ప్రింట్..
ఇది కేవలం ఆస్తిపన్ను సర్వే కాదు. నగరానికి ఒక ‘డిజిటల్ ట్విన్’ రూపొందించి, కృత్రిమ మేధ (ఏఐ) డ్రోన్ సాంకేతికత, జీఐఎస్ డేటాతో భవిష్యత్ వరంగల్కు శాసీ్త్రయ అభివృద్ధి ప్రణాళిక సిద్ధం చేసే ప్రాజెక్టు. హైదరాబాద్లో అమలవుతున్న నమూనాను ఇప్పుడు వరంగల్లో అమలు చేయనున్నారు. ఇప్పటివరకు మున్సిపల్ అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే చేసి ఆస్తుల వివరాలు నమోదు చేసేవారు. ఈ విధానంలో కొత్త నిర్మాణాలు, అదనపు అంతస్తులు, వాణిజ్య వినియోగానికి మారిన భవనాలు, రికార్డుల్లో లేని ఆస్తులు పూర్తిగా గుర్తించడం కష్టమయ్యేది. ఇకపై ప్రత్యేక డ్రోన్లు నగరంపై ఎగురుతూ అత్యంత స్పష్టతతో చిత్రాలను సేకరిస్తాయి. ఆ చిత్రాలను ఏఐ ఆధారిత విశ్లేషణతో పరిశీలించి ప్రతి భవనం విస్తీర్ణం, ఎత్తు, వినియోగం, నిర్మాణ స్థితి వంటి వివరాలను డిజిటల్గా నమోదు చేస్తారు. అనంతరం వాటిని ప్రస్తుతం ఉన్న ఆస్తి పన్ను రికార్డులతో సరిపోల్చి వ్యత్యాసాలను గుర్తిస్తారు.
హైదరాబాద్లో సక్సెస్.. ఇప్పుడు వరంగల్లో
హైదరాబాద్లో ఇప్పటికే డ్రోన్, జీఐఎస్ ఆధారిత సమగ్ర ఆస్తుల మ్యాపింగ్ చేపట్టారు. ఆ ప్రక్రియలో పెద్ద సంఖ్యలో పన్ను రికార్డులకు బయట ఉన్న లేదా వివరాల్లో వ్యత్యాసాలున్న ఆస్తులను గుర్తించి, ఆదాయాన్ని పెంచే దిశగా చర్యలు ప్రారంభించారు. దీనివల్ల రూ.కోట్లల్లో ఆదాయం పెరిగినట్లు జీహెచ్ఎంసీ అప్పట్లో ప్రకటించింది. అదే నమూనాను ఇప్పుడు వరంగల్లో అమలు చేయడం ద్వారా రికార్డుల్లో లేని ఆస్తులు, అదనపు అంతస్తులు, విస్తరణలు, వాణిజ్య వినియోగాలు గుర్తించే అవకాశం ఉంటుంది. దీంతో ఆస్తి పన్ను పరిధి విస్తరిస్తుంది. పన్ను ఎగవేత తగ్గుతుంది. కార్పొరేషన్కు అదనపు ఆదాయం సమకూరుతుంది. అలాగే నగర పరిపాలనను డిజిటల్గా మార్చడంతోపాటు, స్మార్ట్ సిటీ లక్ష్యాలకు బలమైన పునాది పడుతుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.
3డీ డేటాబేస్..
వరంగల్కు డిజిటల్ ట్విన్
ఈ ప్రాజెక్టులో నగరానికి కేవలం మ్యాప్ మాత్రమే కాదు, 3డీ డిజిటల్ నమూనా (డిజిటల్ ట్విన్) కూడా సిద్ధమవుతుంది. భవనం ఎత్తు, అంతస్తుల సంఖ్య, ఆకృతి, రహదారులతో అనుసంధానం, పరిసర నిర్మాణాలు, మౌలిక సదుపాయాల వివరాలు అన్నీ డిజిటల్గా నమోదవుతాయి. దీంతో కొత్త రోడ్లు ఎక్కడ వేయాలి? భవిష్యత్లో ఫ్లైఓవర్లు ఎక్కడ అవసరం? డ్రెయినేజీ వ్యవస్థను ఎలా విస్తరించాలి? వరద ముంపు ప్రాంతాలు ఏవి? ట్రాఫిక్ను ఎలా నియంత్రించాలి? అనే అంశాలపై శాసీ్త్రయంగా నిర్ణయాలు తీసుకునే వీలుంటుంది.
రోడ్ల విస్తీర్ణం: 5,623 చ.కి
పైప్లైన్లు: 1,593 చ.కి
ప్రతీ ఆస్తి కంప్యూటర్లోకి...
జీఐఎస్ ద్వారా నగరానికి సంబంధించిన భౌగోళిక సమాచారమంతా ఒకే డిజిటల్ మ్యాప్లో ఉంటుంది. అధికారులు ఒకే స్క్రీన్పై...ఏ ప్రాంతంలో ఎన్ని భవనాలున్నాయి? ఎక్కడ రోడ్లు, డ్రెయినేజీలు, నీటి పైపులు ఉన్నాయి? ఎక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయి? ఎక్కడ అభివృద్ధి అవసరం? ఎక్కడ పన్ను బకాయిలు ఎక్కువగా ఉన్నాయి? అనే వివరాలను తక్షణమే తెలుసుకోగలుగుతారు.


