హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్
హన్మకొండ అర్బన్: ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణలో భాగంగా దరఖాస్తుల వివరాల నమోదును వేగవంతం చేసి, నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం అదనపు కలెక్టర్ ఎన్.రవితో కలిసి నిర్వహించిన సమీక్షలో వరంగల్ పశ్చిమ, పరకాల నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాల వారీగా దరఖాస్తుల పంపిణీ, స్వీకరణ, నమోదు పురోగతిని పరిశీలించారు. ఈసందర్భంగా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ మాట్లాడుతూ.. వెనుకబడిన పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. శని, ఆదివారాల్లో సీనియర్, జూనియర్ సహాయకులను తక్కువ పురోగతి ఉన్న పోలింగ్ కేంద్రాలకు ప్రత్యేకంగా కేటాయించినట్లు తెలిపారు. వారు క్షేత్రస్థాయి అధికారులకు పూర్తి సహకారం అందించి, దరఖాస్తుల నమోదును వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రతీ పోలింగ్ కేంద్రం పురోగతిని రోజువారీగా పర్యవేక్షిస్తూ గడువులోగా ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస్, ఆర్డీఓ వెంకటేశ్, తహసీల్దార్ రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సమగ్ర శిక్ష, పీఎం పోషణ్
అమలు వేగిరం చేయండి
జిల్లాలో సమగ్ర శిక్ష, పీఎం పోషణ్ కార్యక్రమాల అమలుతో పాటు ప్రగతి సమాచార వ్యవస్థలో ఆర్థిక, భౌతిక పురోగతి వివరాలను గడువులోగా నమోదు చేయాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. ఈమేరకు శుక్రవారం కలెక్టరేట్లో ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్వీ.గిరిరాజ్ గౌడ్, సమగ్ర శిక్ష సమన్వయకర్తలు మహేశ్, డాక్టర్ మన్మోహన్, సునీత, సుమ, రఘుచంద్రరావు, క్రాంతికుమార్, తదితరులు పాల్గొన్నారు.


