హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు వెంకట్రామ్రెడ్డి
హన్మకొండ చౌరస్తా: కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి పటిష్టం చేయడమే మనందరి మొదటి లక్ష్యమని డీసీసీ అధ్యక్షుడు వెంకట్రామ్రెడ్డి అన్నారు. శుక్రవారం నగరంలోని జిల్లా కాంగ్రెస్ భవన్లో జిల్లా అధ్యక్షుడు వెంకట్రామ్రెడ్డి అధ్యక్షతన జిల్లా కాంగ్రెస్ కమిటీ సంస్థాగత సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతీ మండలం, ప్రతీ డివిజన్ పరిధిలో పార్టీ శ్రేణులు నిరంతరం ప్రజలతో మమేకమవుతూ, సమన్వయంతో క్షేత్రస్థాయి కార్యాచరణను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఏఐసీసీ, టీపీసీసీలకు సమర్పించాల్సిన నివేదికల విషయంలో నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేసి, నివేదికలను సకాలంలో అందించాలని నాయకులకు సూచించారు. నాయకులు, కార్యకర్తలు అందరూ ఒకే తాటిపైకి వచ్చి ముందుకు సాగాలని, పార్టీని మరింత ప్రజాదరణ పొందేలా ముందుకు కృషి చేద్దామన్నారు. ఆదేశాలను నిర్లక్ష్యం చేస్తే నిబంధనల ప్రకారం క్రమశిక్షణ చర్యలు తప్పవని సున్నితంగా హెచ్చరించారు. అనంతరం ‘చరక’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సమావేశంలో టీపీసీసీ జిల్లా కో–ఆర్డినేటర్ శ్రీనివాస్గౌడ్, టీపీసీసీ అధికార ప్రతినిధి కూచన రవళి, టీపీసీసీ ట్రైనర్ పులి అనిల్, జిల్లా ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, మండల అధ్యక్షులు, వర్ధన్నపేట నియోజకవర్గ పరిధి డివిజన్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.


