● 18 మంది అవసరం ఉండగా..
నలుగురే ట్యూటర్లు
● వార్డెన్లు లేకుండా కొనసాగుతున్న హాస్టల్ నిర్వహణ
కాశిబుగ్గ: వరంగల్ ఎంజీఎం ఆవరణలోని ప్రభుత్వ జనరల్ నర్సింగ్ స్కూల్ నలుగురు ట్యూటర్లతో నడుస్తోంది. వాస్తవానికి 18 మంది ట్యూటర్లు అవసరం ఉండగా.. కేవలం నలుగురు మాత్రమే జాయిన్ కావడంతో విద్యార్థినుల బోధనకు ఇబ్బందులు తప్పట్లేదు. ఈ స్కూల్లో మూడేళ్ల కోర్సులో 200 మంది చదువుతున్నారు. వీరందరికి చదువుతోపాటు ఎంజీఎంలో నర్సింగ్ సేవలు, హాస్టల్ సదుపాయం ప్రిన్సిపాల్తో పాటు ట్యూటర్లు చూసుకోవాల్సి ఉంటుంది. దీంతో నిత్యం విద్యార్థినులు ఇక్కట్లకు గురవుతున్నారు. అలాగే విద్యార్థినుల హాస్టల్ చూసుకోవడానికి ఇద్దరు వార్డెన్లు అవసరం ఉండగా.. ఒకరు కూడా లేరు. తక్షణమే ట్యూటర్లను నియమించి, విద్యాబోధనకు ఇక్కట్లు తొలగించాలని విద్యార్థినుల తల్లిదండ్రులు కోరుతున్నారు.


