చందోలు(కర్లపాలెం): స్థానిక బగళాముఖి అమ్మవారిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కిరణ్మయి ఆదివారం దర్శించుకుని పూజలు చేశారు. అమ్మవారి ఆలయానికి విచ్చేసిన న్యాయమూర్తికి ఆలయ అర్చకులు, ఈఓ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారి పూజల అనంతరం న్యాయమూర్తిని ఈఓ నరసింహమూర్తి శాలువాతో సన్మానించి అమ్మవారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ చక్రధర్రెడ్డి, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.
గుంటూరు లీగల్: మధ్యవర్తిత్వం ద్వారా కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య వివాదాలు, ఆస్తి పంపకాలు, భూ సరిహద్దు వివాదాలు తదితర సమస్యలు పరిష్కరించుకోవచ్చని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ అన్నారు. జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ బి.సాయి కళ్యాణ్ చక్రవర్తి ఆదేశాలతో గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం చింతపల్లిపాడు గ్రామంలో ఆదివారం మధ్యవర్తిత్వంపై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. జియాఉద్దీన్ మాట్లాడుతూ మధ్యవర్తిత్వం అనేది సమాజంలోని వ్యక్తులు లేదా సమూహాల మధ్య వచ్చే చిన్నపాటి వివాదాలపై కోర్టులకు వెళ్లకుండా శాంతియుతంగా, రాజీమార్గంలో పరిష్కరించే ఒక ప్రక్రియ అని, శిక్షణ పొందిన మధ్యవర్తులు ఇరువర్గాలతో మాట్లాడి వారి పరస్పర అంగీకారంతో పరిష్కరిస్తారని అన్నారు. ఆరవ అదనపు సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్)షేక్ గౌస్బాషా మాట్లాడుతూ మధ్యవర్తిత్వం ద్వారా కోర్టులలో పెండింగ్లో ఉన్న కేసులలో సత్వర పరిష్కారం లభిస్తుందని, ఎలాంటి ఖర్చు లేకుండా సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. కార్యక్రమంలో కమ్యూనిటీ మీడియేటర్స్, ప్రజలు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.
గుంటూరు వెస్ట్ (క్రీడలు): నైట్స్ క్యాజిల్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఏపీ రాష్ట్ర ర్యాంకింగ్ అండర్–6, 8, 10, 12, 14, 16 బాలబాలికల చెస్ పోటీలు ఆదివారం స్థానిక భారతీయ విద్యాభవన్లో విజయవంతంగా ముగిశాయి. పోటీల నిర్వాహకుడు వైవీకే చక్రవర్తి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 300 చిన్నారులు ఎంతో ఉత్సాహంగా పోటీల్లో పాల్గొన్నారన్నారు. అన్ని గ్రూపుల్లో కలిపి ఎంపికై న మొదటి పది మంది విజేతలకు ఏపీ రెరా బోర్డ్ సభ్యుడు దామచర్ల శ్రీనివాసరావు, జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షులు సీహెచ్ రవీంద్రరాజు, యరగుంట్ల అప్పారావు, న్యాయవాది వై.హరిహరరాయులు బహుమతులు ప్రదానం చేశారన్నారు.
గుంటూరు రూరల్: గుంటూరు నగర శివారులోని లాంఫాం వ్యవసాయ పరిఽశోధన స్థానంలో ఉన్న ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని పురస్కరించుకుని ఆదివారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విశ్వవిద్యాలయం అధికారులు టంగుటూరి ప్రకాశం పంతులు జీవిత విశేషాలను పంచుకున్నారు. ఆయన చూపిన మార్గంలో దేశభక్తి, ధైర్యం, ఆత్మగౌరవం, నిబద్ధత, ప్రజాసేవ అనే ఐదు విలువలను మన జీవితాల్లో ఆచరణలో పెట్టగలిగితే, అదే ఆంధ్ర కేసరికి మనం అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ప్రకాశం పంతులు జీవిత విశేషాలను తెలిపే దృశ్యశ్రవణ మాలికను ప్రదర్శించారు.


