జెడ్పీ డెప్యూటీ సీఈఓ సీహెచ్ కృష్ణ
గుంటూరు ఎడ్యుకేషన్: రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వర్తించిన అనంతరం నిరాడంబర జీవితాన్ని గడిపిన టంగుటూరి ప్రకాశం పంతులు జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని జెడ్పీ డిప్యూటీ సీఈవో సీహెచ్ కృష్ణ పేర్కొన్నారు. ఆదివారం ఆంధ్ర రాష్ట్ర ప్రథమ సీఎం టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా జెడ్పీ సమావేశ మందిరంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళుర్పించారు. కార్యక్రమంలో ఉద్యోగులు పాల్గొన్నారు.
గ్రంథాలయ సంస్థలో...
అరండల్పేటలోని జిల్లా కేంద్ర గ్రంథాలయసంస్థలో టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి జిల్లా గ్రంథాలయసంస్థ కార్యదర్శి వంకదారి సుబ్బరత్నమ్మ పూలమాల వేసి నివాళులర్పించారు. ఆమె మాట్లాడుతూ నిరుపేద కుటుంబంలో పుట్టి, వారాలు చేసుకుంటూ చదువుకుని ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి అయిన ధీరోదాత్తుడు టంగుటూరి ప్రకాశం పంతులు అని కొనియాడారు. మద్రాసులో జరిగిన సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో తుపాకీకి ఎదురుగా గుండెను చూపించి ఆంధ్ర కేసరిగా మారారని అన్నారు. కార్యక్రమంలో ఉప గ్రంథ పాలకురాలు కందుల ఝాన్సీలక్ష్మి, ఉద్యోగులు పాల్గొన్నారు.
టంగుటూరిని ఆదర్శంగా తీసుకోవాలి
గుంటూరు మెడికల్: ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని పురస్కరించుకొని ఆదివారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆమె మాట్లాడుతూ ప్రకాశం పంతులు ఒక నిర్భయ స్వాతంత్య్ర సమరయోధులని పేర్కొన్నారు. నీతి,నిజాయితీ, ధైర్యానికి మారుపేరన్నారు. మహాత్మాగాంధీ నిర్వహించిన సహాయ నిరాకరణ ఉద్యమంలో చేరడానికి తన న్యాయవాద వృత్తిని వదులుకున్నారని చెప్పారు. ఆయన ధైర్యానికి ఆంధ్రకేసరి బిరుదును సొంతం చేసుకున్నారని, ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన జీవితాన్ని మనం ఆదర్శం గా తీసుకోవాలని వెల్లడించారు. పలువురు వైద్య సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
జిల్లా పోలీస్ కార్యాలయంలో..
నగరంపాలెం: త్యాగానికి, నిర్భయత్వానికి ప్రతీకగా ప్రకాశం పంతులు నిలిచారని ట్రాఫిక్ డీఎస్పీ బెల్లం శ్రీనివాసరావు అన్నారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో అమరజీవి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆర్ఎస్ఐలు, ఏఆర్ ఎస్ఐ తదితరులు నివాళులర్పించారు.
ఆంధ్రకేసరి టంగుటూరి సేవలు చిరస్మరణీయం
గుంటూరు వెస్ట్: స్వాతంత్య్ర సమరయోధుడిగా, న్యాయవాదిగా, ప్రజా నాయకుడిగా దేశానికి, రాష్ట్రానికి విశిష్ట సేవలందించిన టంగుటూరి ప్రకాశం పంతులు జిల్లా రెవెన్యూ అధికారి షేక్ ఖాజావలి కొనియాడారు. టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలను ఆదివారం స్థానిక కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్య్ర ఉద్యమంలో ఆయన ధైర్యసాహసాలతో పాల్గొని ప్రజల్లో జాతీయ స్ఫూర్తిని నింపారని పేర్కొన్నారు. బ్రిటిష్ సైనికులు తుపాకులు గురిపెట్టినా వెనుకడుగు వేయకుండా తన గుండె చూపించి నిలబడిన ధైర్యానికి గుర్తుగా ఆయనకు ‘ఆంధ్రకేసరి’ అనే బిరుదు లభించిందన్నారు. ప్రజల హక్కులు, స్వాతంత్య్రం, సామాజిక న్యాయం కోసం ఆయన జీవితాంతం కృషి చేశారన్నారు. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కూడా ప్రజలకు సేవలందించిన ఆయన పరిపాలనా దక్షత, ప్రజాసేవా దృక్పథం నేటి తరానికి ఆదర్శప్రాయమన్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజాసేవలో ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పనిచేయాలని డీఆర్ఓ పిలుపునిచ్చారు. దేశం కోసం, ప్రజల కోసం ఆయన చేసిన త్యాగాలను స్మరించుకోవడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దుర్గా భాయి, జిల్లా వైద్యశాఖాధికారి డాక్టర్ కె.విజయలక్ష్మి, కలెక్టరేట్ ఏఓ మల్లీశ్వరి, ఉద్యోగ సంఘ నాయకులు ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.


