తాడేపల్లి రూరల్: రాజధాని అమరావతి ప్రాంతంలో సీడ్ యాక్సెస్ రోడ్కు అనుసంధానంగా సీఆర్డీఏ, రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంలో కొన్ని నివాసాలు తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వారికి ఇప్పటంలో వివాదాస్పద భూముల్లో ప్లాట్లు కేటాయించారని, బాధితులు ఆందోళన చెందుతున్నారని ‘సాక్షి’లో ఆదివారం కథనం వెలువడింది. దీనిపై స్పందించిన అధికారులు ఆదివారం ఆ వివాదాస్పద భూమిలో రైతు సాగు చేసిన వరి పంటను తొలగించే ప్రక్రియను ప్రారంభించారు. పంటను ఎలా నాశనం చేస్తారంటూ రైతు ప్రశ్నించాడు. దీనిపై తాడేపల్లి తహసీల్దార్ మాట్లాడుతూ ఆ రైతుకు అక్కడ 30 సెంట్లకు పట్టాదారు పాసు పుస్తకం ఉందని, మిగిలిన 25 సెంట్లకు అతడికి ఎటువంటి హక్కు లేదని, ఇళ్లు కోల్పోయిన బాధితులకు ఆ స్థలం కేటాయించామని, ఇప్పటికే సంబంధిత రైతును పలుమార్లు డాక్యుమెంట్లు తీసుకురావాలని కోరామని, వారు తీసుకురాలేదని, మా రికార్డుల ప్రకారం రైతుకు 30 సెంట్లు ఉందని, అతడ పొలం వదిలివేసి ప్లాట్లు కేటాయించినట్లు ఆయన తెలిపారు.


