లక్ష్మీపురం: భారతీయ రైల్వేతో భాగస్వామ్యంలో భాగంగా చేపడుతున్న ‘ఫ్రైట్ లాజిస్టిక్స్ మార్కెట్ స్టడీ’లో (సరుకు రవాణా లాజిస్టిక్స్ అధ్యయనం) భాగంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ బెంగళూరు (ఐఐఎం) బృందం బుధవారం గుంటూరు డివిజనల్ డీఆర్ఎం కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా డీఆర్ఎం సుథేష్ఠ సేన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ఈ అధ్యయనం ప్రధానంగా సరుకు రవాణా మార్కెట్ను అంచనా వేయడం, కొత్త రకం సరుకుల రవాణా అవకాశాలను గుర్తించడం, లాజిస్టిక్స్ అవసరాలను తెలుసుకోవడం మరియు రైలు సరుకు రవాణాను బలోపేతం చేయడానికి అవసరమైన వ్యూహాలను రూపొందించడం ద్వారా రైలు రవాణా వాటా ను పెంచడంపై దృష్టి సారిస్తుందన్నారు. ఐఐఎం బెంగళూరు బృందం గుంటూరు డివిజన్ అధికారులు, వాటాదారులతో చర్చలు నిర్వహించడం జరిగిందన్నారు. సరుకుల వారీగా ఉన్న రవాణా సామర్థ్యం, లోడింగ్, అన్లోడింగ్ విధానాలు, ప్రధాన రవాణా టెర్మినల్స్, రైలు అనుసంధానం టెర్మినల్ మౌలిక సదుపాయాలు కార్యాచరణ అవసరాలపై విస్తృతంగా చర్చించడం జరిగిందన్నారు. సరుకు రవాణా వ్యాపారాన్ని లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని పెంపొందించే దిశగా, వాటాదారుల భాగస్వామ్యం కోసం కొన్ని కీలక అంశాలను గుర్తించడం జరిగిందన్నారు. గుంటూరు రైల్వే డివిజన్ సరుకు రవాణా అవకాశాలను విస్తరించడానికి, కస్టమర్ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి సుస్థిరమైన రైలు ఆధారిత లాజిస్టిక్స్ను ప్రోత్సహించడానికి మౌలిక సదుపాయాలను, కనెక్టివిటీని ఉపయోగించుకోవడానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉందన్నారు. సంబంధిత సంస్థల నిర్వాహకులు, డివిజన్ అధికారులు పాల్గొన్నారు.


