కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఘనంగా ఆదివాసీ దినోత్సవం
గుంటూరు వెస్ట్: గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్న్స్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు.
ఏపీ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమం ఆదివారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించారు. డాక్టర్ పెమ్మసాని మాట్లాడుతూ దేశం కోసం, స్వాభిమానం కోసం ప్రాణాలర్పించిన ఎంతోమంది ఆదివాసి నాయకులను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గిరిజనుల హక్కుల కోసం పోరాడిన బీర్సా ముండా, మన్యం వీరులు అల్లూరి సీతారామరాజు వంటి ఎంతోమంది పోరాట యోధులను స్మరించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని తెలిపారు. గిరిజన ప్రాంత అభివృద్ధి, సహకారం గురించి లోతుగా ఆలోచించి, సరైన సమయంలో సహాయం అందించిన నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పట్టణాలు ఎంత అందంగా ఉంటాయో అంతకుమించి గ్రామాలు కూడా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో వీబీ జీ రామ్ జి పథకం ద్వారా అందరికీ సకల సౌకర్యాలు అందించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ మాట్లాడుతూ గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు గొప్ప సంపదలన్నారు. గిరిజన ప్రాంతంలో పనిచేశానని, అప్పటి ఉద్యోగ జీవితం గొప్ప సంతృప్తిచ్చిందన్నారు. సంస్కృతి, సంప్రదాయాలకు గిరిజనులు నిజమైన వారసులని కొనియాడారు. అనంతరం అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గిరిజన నాయకులను సత్కరించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ, ఎమ్మెల్యే గళ్లా మాధవి, శ్రీను నాయక్, మేడా రామకృష్ణ, బాపట్ల ఏసుబాబు, చంద్రనాయక, కట్ట వెంకటేశ్వర్లు, కే కోటయ్య, బీజేపీ జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు, తదితరులు పాల్గొన్నారు.


