తాడేపల్లి రూరల్: సోనోవిజన్ అధినేత పొట్లూరి జనార్ధనమూర్తి 89వ జన్మదిన వేడుకలను ఆదివారం అమరావతి కరకట్ట వెంబడి ఉన్న ఆక్వా డెవిల్స్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఆక్వా డెవిల్స్ వ్యవస్థాపకులు, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు మాట్లాడుతూ వ్యాపార రంగంలో రాణించిన జనార్ధనమూర్తి అనేక సామాజిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఆయన జీవిత ప్రస్థానంలో వ్యాపారవేత్తగా సాధించిన విజయాలు, సమాజ శ్రేయస్సు కోసం చూపి దాతృత్వం ఎందరికో స్ఫూర్తిదాయకమని ఆయన ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. పలువురు ప్రముఖులు జనార్ధనమూర్తి దంపతులను అభినందించారు. కార్యక్రమంలో ఆకుల శ్రీనివాసకుమార్ తదితరులు పాల్గొన్నారు.
లక్ష్మీపురం: విద్యార్థుల సమస్యలపై నిరంతరం పోరాడుతూ, విద్యను సామాజిక మార్పుకు ఆయుధంగా మలచడంలో ఎస్ఎఫ్ఐ కీలక పాత్ర పోషిస్తోందని మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు అన్నారు. ఎస్ఎఫ్ఐ జిల్లా ప్లీనరీ సమావేశాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. లక్ష్మణరావు మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయడంతోపాటు పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల హక్కుల కోసం ప్రశ్నించే గొంతుకలను బలోపేతం చేయాలని, విద్యార్థి ఉద్యమాన్ని మరింత విస్తృతంగా ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు చదువుతోపాటు సమాజంలో జరుగుతున్న పరిణామాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కే ప్రసన్నకుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యారంగం అనేక సమస్యలను ఎదుర్కొంటోందని అన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతులు, హాస్టల్ సౌకర్యాలు, మెస్ చార్జీ లు, స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ తది తర సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ జిల్లా మాజీ కార్యదర్శి ఎన్.భావనారాయణ మాట్లాడారు.
జిల్లా కన్వీనర్గా షేక్ సమీర్ ఎన్నిక
ప్లీనరీ సమావేశాల్లో ఎస్ఎఫ్ఐ గుంటూరు జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా కన్వీనర్గా షేక్ సమీర్ ఎన్నికయ్యారు. జిల్లా కమిటీ సభ్యులుగా రాజ్కుమార్, దాసరి కిరణ్, డి.పీ.నాయక్, జాషువా, మరియమ్మ, కిన్నెర, యశ్వంత్, సూర్జిత్, ఉమామహేశ్వరరావు, ధీరజ్, జాన్ రాజ్ గణేష్, వినయ్, హనీఫ్, రూబెన్, ఇషాంత్రెడ్డి ఎన్నికయ్యారు.


