ఏఎన్యూ(పెదకాకాని): ఏఎన్యూలో కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేసిన తరువాతే మిగిలిన ఖాళీలు భర్తీ చేయాలని కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ సీహెచ్ తిరుమలరావు అన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట గురువారం రాష్ట్ర ప్రభుత్వం అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకి ఇచ్చిన ఎలిజిబిలిటీ లిస్టులలో తమకు తీవ్ర అన్యాయం జరిగిందని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సీహెచ్ తిరుమలరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీఓఎంఎస్ నెంబరు 114 ప్రకారం కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల సేవలను క్రమబద్ధీకరించాలన్నారు. ఏఎన్యూలో వివిధ విభాగాల్లో, కళాశాలల్లో దాదాపుగా 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న ఒప్పంద అధ్యాపకులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. అన్ని అర్హతలు ఉండి ఎన్నో ఏళ్లగా విశ్వవిద్యాలయాల్లో అన్యాయానికి గురవు తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల సేవలను క్రమబద్ధీకరించాలన్నారు. జీఓ నెంబరు 46, జీఓ నెంబరు 14 ప్రకారం కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు యూజీసీ పే స్కేల్ అమలు చెయ్యాలన్నారు. ప్రభుత్వం పెట్టిన ఎలిజిబుల్ లిస్టుల్లో విశ్వవిద్యాలయాలు యూజీసీ పే స్కేల్ ఇవ్వని కారణం చూపించి ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ల నియామకానికి అనర్హులను చేయడం శోచనీయమన్నారు. యూజీసీ పే స్కేల్ ఇవ్వని కారణంగా తాము రెగ్యులర్ రిక్రూట్మెంట్లో అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టులకి పోటీపడే అవకాశాన్ని కోల్పోతున్నామని వాపోయారు. సంఘం జనరల్ సెక్రటరీ డాక్టర్ వై.సునీత, ఉపాధ్యక్షుడు డాక్టర్ పి.రవి, సహాయ కార్యదర్శులు డాక్టర్ బి.పూర్ణచంద్రశేఖర్, డాక్టర్ తౌషీఫ్ అహ్మద్ పాల్గొన్నారు.


