అమరావతిని సందర్శించిన జర్మనీ కౌన్సిల్ జనరల్ మైకేల్
అమరావతి: ప్రసిద్ధ పర్యాటక కేంద్రం అమరావతిని జర్మనీ కౌన్సిల్ జనరల్ మైకేల్ హస్సర్ బుధవారం సందర్శించారు. తొలుత పురావస్తు మ్యూజియం, అమరావతి బౌద్ధ స్తూపాన్ని, ధ్యానబుద్ధ విగ్రహాన్ని సందర్శించారు. అనంతరం శ్రీ బాలచాముండికా సమేత అమరేశ్వరుని దర్శించుకున్నారు. తొలుత జర్మనీ కౌన్సిల్ జనరల్ మైకేల్ హస్సర్ను ఆలయ అధికారులు, అర్చకులు ఆహ్వానించారు. అమరేశ్వరునికి అభిషేకాలు, బాలచాముండేశ్వరీదేవికి ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహిం చారు. అనంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేసి స్వామివారి శేష వస్త్రం, తీర్థప్రసాదాలు అందించగా ఆలయ ఈవో రేఖ స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ సందర్శనలో ఆయన వెంట జర్మన్ కౌన్సిల్ ఇండియా ప్రతినిధి సందీప్, సాంస్కృతిక శాఖ డైరక్టర్ మల్లిఖార్జునరావు, శ్రీహర్ష, రామకృష్ణ, ఏపీ టూరిజం రీజనల్ డైరక్టర్ లక్ష్మీప్రసన్న, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం. శ్రీనివాసరావు సత్తెనపల్లి అర్డీవో రమణకాంతరెడ్డి, తహసీల్దార్ డానియేలు తదితరులు ఉన్నారు.


