ఇంజినీరింగ్ విద్యార్థిపై దాడి
ఏడుగురు నిందితుల అరెస్ట్
చేబ్రోలు: ఇంజినీరింగ్ విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో యువకుడికి తీవ్ర గాయాలైన సంఘటనపై బుధవారం చేబ్రోలు పోలీసులు ఏడుగురు విద్యార్థులను అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బాపట్ల జిల్లా చుండూరుకు చెందిన భరత్ నాగార్జున యూనివర్సిటీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకుడిగా ఉన్నాడు. వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో జరిగిన యువజనోత్సవాలకు హాజరై తిరిగి వస్తుండగా వివాదం జరిగింది. ఈ నేపథ్యలో శ్రీరామ్, ఆదర్శ్తోపాటు మరో ఏడుగురు కలిసి భరత్పై విచక్షణరహితంగా దాడి చేసి గాయపరిచారు. విద్యార్థి తండ్రి అరుణ్కుమార్ దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ పి.వీరనారాయణ కేసు నమోదు చేశారు. సంఘటనకు కారణమైన తొమ్మిదిమంది నిందితులతో ఏడుగురిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు.
సోషల్ మీడియాలో వైరల్
గంజాయి, మద్యం మత్తులో యువకులు విచక్షణరహితంగా దాడి చేస్తున్న సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చేబ్రోలు మండలం వడ్లమూడి గ్రామ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలోని తోటలోకి తీసుకొని వెళ్లి విద్యార్థిపై తొమ్మిదిమంది కలిసి కొడుతున్నట్లు వీడియోలో ఉంది. పొన్నూరు, శేకూరు, తెనాలి, వినుకొండ, కొలకలూరు ప్రాంతాలకు చెందిన విద్యార్థులు కర్రలు, బెల్టుతో అతడిని తీవ్రంగా గాయపరిచారు. ముఖంపై, నడుము, కాళ్లు, చేతులు, వీపుపై దాడి చేస్తున్న సంఘటనకు సంబందించిన వీడియో వైరల్ అయింది. అపస్మారక స్థితికి చేరుకొన్న ఆ విద్యార్థి.. ప్రాణాలు కోల్పోయాడని నిందితులు భావించారు.


