సాహితీవేత్తలపై బృహత్తర కర్తవ్యం | - | Sakshi
Sakshi News home page

సాహితీవేత్తలపై బృహత్తర కర్తవ్యం

Aug 10 2025 6:04 AM | Updated on Aug 10 2025 6:04 AM

సాహితీవేత్తలపై బృహత్తర కర్తవ్యం

సాహితీవేత్తలపై బృహత్తర కర్తవ్యం

సంక్షుభిత వేళ

తెనాలి: ప్రపంచంలో ప్రమాదకర పరిణామాలు జరుగుతున్న సందర్భంలో సాహితీవేత్తలపై గొప్ప కర్తవ్యాలు ఉన్నాయని ‘అరసం’ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుగ్రహీత పెనుగొండ లక్ష్మీనారాయణ అన్నారు. కశ్మీర్‌లో కొన్ని గ్రంథాలను నిషేధించారని చెబుతూ రచయితలు, సాహితీవేత్తలపై అప్రకటిత నిషేధం, అక్రమ అరెస్టులు దారుణమన్నారు. ‘అరసం’, తెనాలి శాఖ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ఏర్పాటైన సభలో ప్రముఖ దళిత సీ్త్రవాద రచయిత్రి ప్రొఫెసర్‌ చల్లపల్లి స్వరూపరాణి కవితా సంపుటి ‘అల్లిక’ను లక్ష్మీనారాయణ ఆవిష్కరించారు. సభకు జిల్లా ఉపాధ్యక్షుడు కనపర్తి బెన్‌హర్‌ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథి లక్ష్మీనారాయణ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, తెలుగు రాష్ట్రాల్లో నిషేధాలు, అరెస్టులు కొత్త కాదన్నారు. చీకట్లోకి వెళుతున్న ఈ దేశాన్ని వెలుగులోకి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఈ నేపథ్యంలో సొంతూరు పాపర్రు నుంచి ఇజ్రాయెల్‌ వరకు అంశాలతో స్వరూపరాణి రాసిన కవితల్లో ప్రాపంచిక, తాత్విక దృష్టి రెండూ కనిపించాయన్నారు.

● బహుజన రచయితల వేదిక డాక్టర్‌ నూకతోటి రవికుమార్‌ మాట్లాడుతూ మన బతుకుల్ని మనల్నుంచి లాగేసుకుంటున్నపుడు మాట్లాడకపోవటం చారిత్రక ద్రోహం అవుతుందన్నారు. ఆచార్య వృత్తిలో ఉంటూనే సామాజిక దృష్టికోణంలో రచనలు చేస్తున్న స్వరూపరాణి తాజా సంపుటి ‘అల్లిక’ చదివితే ఎందుకు రాయాలి? రాయకపోవడం ఎలా నేరమవుతుంది? అనేది అర్థం కాగలదన్నారు.

● ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి తన ప్రసంగంలో దళిత జీవన మూలాల్లోని పదబంధాలతో స్వరూపరాణి గొప్ప ప్రయోగం చేశారని ప్రశంసించారు. సామాజిక పరివర్తన కేంద్రం ఉన్నవ వినయ్‌కుమార్‌ తన ప్రసంగంలో స్వరూపరాణి కవితల్లోని అంశాలను విశదీకరించారు.

● కవయిత్రి స్వరూపరాణి మాట్లాడుతూ తన అనుభవాలు, జ్ఞాపకాలతోపాటు అవమానాలు కూడా కలబోసుకున్నది తెనాలి ప్రాంతమని చెబుతూ ఎక్కడకు వెళ్లినా, ఎంత చదివినా ఇక్కడి నుంచే మాట్లాడతానని చెప్పారు. తనతోటి అణగారిన వర్గాల ప్రజల కష్టాలు, కన్నీళ్లు, చెమట కలిసినవే తన అక్షరాలుగా చెబుతూ, వివక్ష ఉన్నంతవరకూ రాస్తూనే ఉంటానని స్పష్టం చేశారు.

● దళిత సీ్త్రవాదంలో ప్రథమురాలు స్వరూపరాణి అని కవి, విశ్రాంత ప్రొఫెసర్‌ కొండపల్లి సుదర్శనరాజు అన్నారు. సమావేశంలో డాక్టర్‌ మిరప మాధవి, బహుజన రచయితల వేదిక తంగిరాల సోనీ మాట్లాడారు. అరసం జిల్లా అధ్యక్షుడు చెరుకుమల్లి సింగారావు స్వాగతం పలికారు.

‘అల్లిక’ పుస్తకావిష్కరణ సభలో అరసం జాతీయ అధ్యక్షుడు పెనుగొండ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement