
ఈ దశాబ్ద కాలంలో భారత్ ప్రపంచంలో ఒక బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదగటమే కాదు, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో కూడా తన స్థానాన్ని మెరుగుపరుచుకుంటూ మొదటిసారి వంద లోపు ర్యాంకు సాధించటం ఆహ్వానించ దగిన పరిణామమే. 2030 నాటికి వాతావరణం, జీవుల పరి రక్షణ, పేదరిక నిర్మూలన, గౌరవప్రదమైన ఉపాధి, నాణ్యమైన విద్య, ఆహార భద్రత, ఆరోగ్య సంరక్షణ, అసమానతల నిర్మూలన, లింగ సమానత్వం, సురక్షితమైన త్రాగునీరు, మౌలిక సదుపాయాల కల్పన లాంటి 17 లక్ష్యాలను సాధిం చాలనే సంకల్పంతో 2015లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను ప్రకటించింది. అభి వృద్ధి, వనరుల వినియోగం అనేది ప్రస్తుత తరానికే కాదు భవిష్యత్ తరాలకు కూడా అనే విస్తృత అర్థంలో సుస్థిరాభివృద్ధి భావనను ఉపయోగించటం జరుగుతుంది.
సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధ నలో భారత్ 2017లో 116వ ర్యాంకును, 2022లో 121వ ర్యాంకును, 2024లో 109వ ర్యాంకును సాధించింది. ఐక్యరాజ్యసమితి సుస్థి రాభివృద్ధి సొల్యూషన్స్ నెట్వర్క్ నివేదిక ప్రకారంగా 2025లో భారత్ తన ర్యాంకును మెరు గుపరుచుకుని 167 దేశాలలో 67 స్కోర్తో 99వ ర్యాంకును సాధించింది.
ఎప్పటిలాగానే 85 నుండి 86 స్కోర్తో గత మూడు పర్యాయాలుగా ఫిన్లాండ్, స్వీడన్, డెన్మార్క్ దేశాలు మొదటి మూడు స్థానాలలో కొనసాగుతున్నాయి. ప్రపంచంలోనే మొదటి మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా 44, చైనా 49, జర్మనీ 4 ర్యాంకులు సాధించాయి. భారత్ సమీప దేశాలైన మాల్దీవులు (53), శ్రీలంక (93), భూటాన్ (74), నేపాల్ (85)లు భారత్ కంటే మెరుగైన ర్యాంకులను సాధిస్తే... బంగ్లాదేశ్ 114, పాకిస్తాన్ 140 ర్యాంకులతో సరిపెట్టుకున్నాయి.
గత దశాబ్ద కాలంగా దేశంలో ఆహార భద్రతా చర్య లలో భాగంగా ‘ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన’, ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన’, ‘ప్రధాన మంత్రి ఉజ్వల యోజన’, జాతీయ ఆరోగ్య మిషన్’ లాంటి పథకాలను అమలు చేయడం ద్వారా సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో భారత్ తన ర్యాంకుని మెరుగుపరచు కోగలిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే, ఆర్థిక అభివృద్ధిని కొలిచే ప్రమాణాలలో ఒకటైన మానవాభివృద్ధి సూచిక (హెచ్డీఐ)లో భారత్ మెరుగైన ర్యాంకుని సాధించలేక పోతోంది. 2025 సంవత్సరానికి గాను యూఎన్డీపీ ప్రకటించిన హెచ్డీఐ ర్యాంకులలో భారత్ తన ర్యాంకును 134 నుండి 130కి మెరుగుపరచుకోగలి గినా, 193 దేశాలలో భారత్ హెచ్డీఐలో 130వ స్థానంలో నిల వటం శోచనీయం.
అమెరికా, చైనా, జర్మనీల తరువాత భారత్ ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించ బోతోంది. కానీ ఆర్థిక అభివృద్ధికి ప్రమాణాలుగా భావిస్తున్న తలసరి ఆదాయంలో 141వ ర్యాంకు, ఆకలి సూచీలో 105వ ర్యాంకు, స్థూల సంతోష సూచిలో 118వ ర్యాంకుతో ప్రపంచంలో అత్యధిక పేదలు ఉన్న (23.4 కోట్లు) దేశంగా భారత్ నిలవటం శోచ నీయం.
ఈ సూచికలలో భారత్ సామర్థ్యం మెరుగుపడకుండా 2028 నాటికి భారత్ ప్రపంచంలో మూడవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగినా అభివృద్ధి ఫలాలు కింది వర్గాల ప్రజలకి చేరకపోవచ్చు.
– డా‘‘ తిరునహరి శేషు, అసిస్టెంట్ ప్రొఫెసర్, కాకతీయ విశ్వవిద్యాలయం ‘ 98854 65877