తెలంగాణ రణాన్ని, నినాదాన్ని చాటినవాడు

Kothapalli Jayashankar Birth Anniversary Guest Column By Sangani Malleshwar - Sakshi

సందర్భం

తెలంగాణ ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించిన ఉద్యమనేత, తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌ 1934 ఆగస్టు 6న వరంగల్‌ జిల్లా ఆత్మకూర్‌ మండలం, అక్కంపేట గ్రామంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. అధ్యాపకుడిగా, కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకుల పతిగా సేవలు అందించిన జయ శంకర్‌ ఎప్పుడూ తెలంగాణ వాదాన్ని వదిలిపెట్ట లేదు. విద్యార్థిదశ నుంచి కూడా మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నటు వంటి, నిర్మాణాత్మకమైన, నిక్కచ్చిౖయెన మనస్తత్వం గలవాడు ఆయన. తెలంగాణలో జరుగుతున్న ఆంధ్ర వలసవాదుల, సమైక్యవాదుల దోపిడీ నుండి తెలం గాణ విముక్తి కోసం కంకణం కట్టుకున్న విద్యావేత్త. మా వనరులు మాకున్నాయి, మా వనరులపై మాకు అధికారం కావాలని ప్రశ్నించిన వ్యక్తి ప్రొఫెసర్‌ జయశంకర్‌.

తెలంగాణ ప్రజలు ఎన్నాళ్లు యాచించా లనే ఒక కసి, పట్టుదలతో 1952లో నాన్‌ ముల్కీ, ఇడ్లీ, సాంబార్‌ గోబ్యాక్‌ ఉద్యమంలో పాల్గొన్నారు. 1969 నాటి తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి, తనదైన శైలిలో కాకతీయ, ఉస్మానియా విశ్వ విద్యాలయాలలో విద్యార్థులు, ఆచార్యులతో సమా వేశాలు ఏర్పాటుచేసి, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని వివరంగా చెప్పారు. ఆయా విశ్వవిద్యా లయాలలో చదువుతున్న విద్యార్థులను, పరిశోధకు లను కూడగట్టేందుకు ఆయన చేసిన ప్రయత్నం మరు వలేనిది. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని విద్యావంతులు, మేధావులు ప్రతిఘటించాలనీ; ఇది ఒక సామాజిక బాధ్యతగా తీసుకోవాలనీ; విద్యా వంతులమైన మనమే గళం విప్పకపోతే ఎలా? మేధా వులు సామాజిక బాధ్యతను విస్మరించడం క్షంతవ్యం కాదనీ వక్కాణించారు.

నాలుగు గోడల మధ్యలో కుర్చొని, కేవలం నినా దాలు చేయడం ద్వారా సమస్యలకు పరిష్కారం ఉండదని బలంగా నమ్మిన వ్యక్తి జయశంకర్‌. అందుకే సమస్యలకు దారితీసిన కారణాలను సాక్ష్యా ధారాలతో, శాస్త్రీయంగా, గణాంకాలతో సహా నిర్భ యంగా, నిర్మొహమాటంగా విశ్లేషిస్తూ అనేక రచనలు చేశారు. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై తెలం గాణ రణాన్ని, నినాదాన్ని చాటిచెప్పిన ప్రజ్ఞాశాలి.

తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన కల్వ కుంట్ల చంద్రశేఖరరావు తన వాణి, బాణీæ వినిపి స్తున్న క్రమంలోనే ప్రజల మద్దతుతో 2001లో తెలం గాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేశారు. ఒకానొక సంద ర్భంలో జయశంకర్‌ మాట్లాడుతూ, ‘‘అబ్తో ఏకీ హీ ఖ్వాయిష్‌ హై, ఓ తెలంగాణ దేఖ్నా మర్‌ జానా (ఇప్పుడైతే నాకు ఒకే ఒక కోరిక మిగిలింది, అది చని పోయేలోగా తెలంగాణ ఏర్పాటు కళ్ళారా చూడటం); అది కేవలం తెలంగాణ మొనగాడు ‘రావు సాబ్‌’తోనే సాధ్యం అవుతుంది, తర్వాత నేను చనిపోవాలి’’ అని అన్న సందర్భాలు అనేకం. జయశంకర్‌ మార్గదర్శ కత్వంలో కేసీఆర్‌ ఆమరణ నిరాహరదీక్ష చేపట్టి, గల్లీ నుంచి ఢిల్లీ వరకు గడగడలాడించడంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి తెలంగాణ ప్రకటన చేయక తప్పలేదు.

2009 డిసెంబర్‌ 9న తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు పేర్కొనడం, ఖంగు తిన్న సమైక్యవాదులు ఆ ప్రకటనను జాతి వ్యతిరే కమైనదిగా, ‘కాగ్నిజబుల్‌ అఫెన్స్‌’గా పేర్కొనడం, తదుపరి జరిగిన పరిణామాలతో డిసెంబర్‌ 23న మరొక ప్రకటన చేసి, శ్రీకృష్ణ కమిటీ రూపంలో తెలం గాణ ప్రజలను గాయపరచడం జరిగింది. తెలంగాణ పోరాటాన్ని ఉధృతం చేసి, నిరవధికంగా ఉద్యమా లను చేస్తూ, కేంద్ర ప్రభుత్వంపై రాజకీయ ఒత్తిడి తెచ్చిన ఫలితంగా 2014 ఫిబ్రవరి 18న ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు లోకసభ ఆమోదం లభిం చింది.

సీమాంధ్రకు న్యాయం చేయడానికి వెంకయ్య నాయుడు ప్రతిపాదించిన సవరణలను కొంతవరకు తృప్తిపరచే విధంగా ప్రధాని ఆరుసూత్రాల ప్యాకేజీని ప్రకటించిన పిదప, 2014 పిభ్రవరి 20న రాజ్య సభలో బిల్లుకు య«థాతథంగా మూజువాణీ ఓటుతో ఆమోద ముద్ర పడింది. 2014 జూన్‌ 2 నాడు దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. ‘సారు’ కలల తెలంగాణ ఏర్పడింది. అయితే ప్రత్యేక తెలం గాణ రాష్ట్రాన్ని చూడకుండానే జయశంకర్‌ అనా రోగ్యంతో 2011 జూన్‌ 21న తుదిశ్వాస విడిచారు.
-డా. సంగని మల్లేశ్వర్‌
వ్యాసకర్త విభాగాధిపతి, జర్నలిజం శాఖ, కాకతీయ విశ్వవిద్యాలయం ‘ 98662 55355
(నేడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌ జయంతి)

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top