లక్షలాది జీవితాలను మార్చిన విప్లవమూర్తి

Activist Gandhian Ela Ramesh Bhatt Changed Millions Of Lives - Sakshi

స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో మహాత్మా గాంధీ స్ఫూర్తిగా సామాజిక సేవకు తమ జీవితాలను అందించిన అనేకమందిలో ఇలా భట్‌ లేదా అందరికీ చిరపరిచితమైన ఇలా బెన్‌ ఒకరు. ఆకాశమే హద్దుగా దేశ భవిష్యత్తు గురించి కలలు కన్న ఇలాబెన్‌ అహ్మదాబాద్‌లో న్యాయవిద్యను అభ్యసించారు. నవ భారత నిర్మాణంలో తాను భాగస్వామి నని గర్వంగా భావించారు. ‘‘జాతి నిర్మాణం అంటే నా దృష్టిలో కార్మికులకు దగ్గర కావడమే. ఎందుకంటే.. ఈ దేశానికి పునాదు లైన వీరు ఇప్పటికీ పేదలుగానే ఉన్నారు. నిర్లక్ష్యానికి గురవు తున్నారు’’ అనేవారు ఆమె. ఆ కాలపు విద్యార్థి నేత రమేశ్‌ భట్‌ కార్యకలాపాలకు ఆకర్షితులైన ఇలా బెన్‌ అతడినే పెళ్లి చేసుకుని జీవిత భాగస్వామి గానూ మారిపోయారు. విద్యాభ్యాసం తరు వాత ఇలా బెన్‌ మజూర్‌ మహాజన్‌ (టెక్స్‌టైల్‌ లేబర్‌ అసోసి యేషన్‌–టీఎల్‌ఏ)లో చేరిపోగా... రమేశ్‌ భట్‌ అహ్మదాబాద్‌లోని గుజరాత్‌ విద్యాపీఠ్‌లో చేరారు. 

మిల్లు వర్కర్ల ట్రేడ్‌ యూనియన్‌ అయిన టీఎల్‌ఏను స్థాపిం చింది అనసూయ సారాభాయ్‌ అయినప్పటికీ దీని రాజ్యాంగాన్ని రచించింది మాత్రం స్వయంగా మహాత్మా గాంధీ కావడం గమనార్హం. ట్రేడ్‌ యూనియన్‌ ప్రాముఖ్యం, నిర్వహణ వంటి అనేక అంశాలను టీఎల్‌ఏ లోనే నేర్చుకున్న ఇలా బెన్‌ ఇక్కడే మొదటిసారి అసంఘటిత రంగంలోని మహిళా కార్మికులను కూడా కలిశారు. వారంతా కాయగూరలు అమ్మే, తోపుడు బండ్లపై వ్యాపారాలు చేసుకునే, దుస్తులు కుట్టే కష్టజీవులైనప్ప టికీ పేదలుగానే ఉండటం ఆమెలోని ఆలోచనలను తట్టిలేపింది. వారి హక్కుల సాధనే లక్ష్యంగా ఇలా బెన్‌ 1972లో ‘సేవా’ సంస్థను ప్రారంభించారు. చిన్నగా మొదలైన ఈ సంస్థ అనతి కాలంలోనే దేశం.. ఆమాటకొస్తే ప్రపంచవ్యాప్త అసంఘటిత మహిళా కార్మికుల ఉద్యమాలకు ఆధారభూతమైంది. ఒక్కో మహిళా కార్మికురాలు... యూనియన్‌ కోసం తమ చిన్న చిన్న సంచి ముడులు విప్పి పావలా చొప్పున చెల్లించడం ఇలా బెన్‌ను ఎంతో ఆశ్చర్యానికి గురి చేసిందట. అయితే కేవలం వీరి హక్కుల కోసం పోరాడటమే సరిపోదని ఇలా బెన్‌ వేగంగా గుర్తించారు. యజమానుల మనసు మార్చే.. మున్సిపాలిటీ, పోలీస్‌ వంటి వ్యవస్థలు మహిళా కార్మికులను దోచుకోకుండా రక్షించేందుకు తగిన చట్టాలూ అవసరమని భావించారు.

ఇజ్రాయెల్‌ పర్యటనలో సహకార సంఘాలు, ట్రేడ్‌ యూనియన్‌ల  పనితీరుపై అవగాహన పెంచుకున్న ఇలా బెన్‌ వాటిని భారత్‌లోనూ స్థాపించే ప్రయత్నం మొదలుపెట్టారు. మహిళా కార్మికులకు తాము పొదుపు చేసుకున్న డబ్బును దాచుకునేందుకు బ్యాంకుల్లాంటి వ్యవస్థలేవీ లేకపోవడం గుర్తించిన ఆమె... వారితో ఓ సహకార బ్యాంకును ఏర్పాటు చేయించారు. అప్పట్లో ఇదో విప్లవాత్మకమైన చర్యే. ఆలోచనలు, కార్యాచరణ రెండూ అలాగే ఉండేవి. సమాజంలోని అట్టడుగు పేదల జీవితాలు మార్చే ఈ పనులకు ఆమె పెట్టుకున్న పేరు ‘అభివృద్ధికి పోరాటం’. ఇలా బెన్‌ మార్గాన్ని ఒక్క గుజరాత్‌లోనే కాదు... భారత్‌తో పాటు ప్రపంచంలోని మరికొన్ని దేశాల్లోనూ అనుకరించారు. 
ఇలా బెన్‌ ఆలోచనలు ఎంత విప్లవాత్మకంగా ఉండేవంటే.. కొన్ని పనులు చేయడంతోనే సమస్యలు పరిష్కారం కావనీ, అసలు సమస్య ఆలోచనా ధోరణులు మార్చడంలోనే ఉందనీ ఆమె గుర్తించారు. చట్టాలు, విధానాలు, దృక్పథాల్లో మార్పులు తీసుకురావడం ద్వారా మాత్రమే అసంఘటిత రంగ మహిళా కార్మికుల హక్కుల సాధన సాధ్యమని నమ్మి ఆచరించారు. ఇలా బెన్‌ కృషికి గుర్తింపు చాలా వేగంగానే రావడం మొదలైంది. 1977లో రామన్‌ మెగసెసె అవార్డు వరించింది. ఆ తరువాతి కాలంలో పద్మశ్రీ, పద్మభూషణ్‌లు కూడా! రాజ్యసభ సభ్యు రాలిగా నామినేట్‌ అయ్యారు. అంతర్జాతీయ స్థాయిలో హార్వర్డ్, యేల్‌ యూనివర్సిటీలు డాక్టరేట్‌లతో సత్కరించాయి. నెల్సన్‌ మండేలా స్థాపించిన అంతర్జాతీయ బృందం ‘ద ఎల్డర్స్‌’లోనూ ఆమెకు సభ్యత్వం లభించింది.

ఇలా బెన్‌ రాజ్యసభ సభ్యురాలిగా వీధి వ్యాపారులు, ఇళ్లలోంచి పనిచేసేవారి కోసం పలు బిల్లులను ప్రవేశపెట్టారు. ఆమె కృషి ఫలితంగానే వీధి వ్యాపారుల బిల్లు చట్టమైంది.
పద్మశ్రీ అవార్డు అందుకునేటప్పుడు కూడా ఇలా బెన్‌ కోరింది ఒక్కటే... అసంఘటిత రంగంలోని మహిళా కార్మికుల కోసం ఓ కమిషన్‌ ఏర్పాటు చేయమని! 1988లో వీరిపై చేసిన అధ్య యనం ‘శ్రమశక్తి’ పేరుతో విడుదలైంది.

శ్రామికులను సంఘటిత పరచడం ఎంత ముఖ్యమైందో ఇలా బెన్‌కు బాగా తెలుసు. అందుకేనేమో... అహ్మదాబాద్‌లో మొదలుపెట్టిన కార్మిక సంస్థలు అంతర్జాతీయ స్థాయికి విస్తరించాయి. ఆమె స్ఫూర్తితో ఇంటర్నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ స్ట్రీట్‌ వెండర్స్, హోమ్‌ బేస్డ్‌ వర్కర్స్‌తోపాటు ఇళ్లల్లో పని చేసేవారు, చెత్త ఏరుకునేవారికీ సంఘాలు ఏర్పడ్డాయి. ఇంట ర్నేషనల్‌ లేబర్‌ యూనియన్‌లోనూ ఇలా బెన్‌ ఇళ్లల్లోంచి పనిచేసుకునే వారి కోసం ఓ సదస్సు ఏర్పాటు చేయడంలో విజయం సాధించారు. పరిశోధకులు, విధాన రూపకర్తలు, సామాజిక కార్యకర్తలతో ఆమె ‘వీగో’ పేరుతో ఒక అంత ర్జాతీయ సంస్థను కూడా ఏర్పాటు చేశారు. ఇలా బెన్‌ సాధించిన అతి గొప్ప విజయం ఏదైనా ఉందంటే.. అది పేద మహిళా కార్మికుల జీవితాలను మార్చడమే కాదు.. విద్యావంతులు, ప్రొఫెషనల్స్‌ కూడా ఉద్యమంలో పాల్గొనేలా చేయడం! గత ఏడాది ‘సేవా’ సంస్థ స్వర్ణోత్సవాలు జరిగాయి. అయితే ఇలా బెన్‌ మాత్రం అప్పటికి కూడా రానున్న యాభై ఏళ్లలో ఎలాంటి మార్పులు తీసుకురాగలమో చూడాలన్న ఆశాభావంతోనే ఉండేవారు.

రేనానా ఝాబ్‌వాలా, వ్యాసకర్త ప్రఖ్యాత సామాజిక కార్యకర్త
(‘ది ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ సౌజన్యంతో)

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top