ఆదోనికి చెందిన దుస్తుల వ్యాపారి రవిచంద్రకు ఇటీవలే వివాహమైంది. వివాహమైన కొన్నాళ్లకే వేరుకాపురం పెట్టాలని భార్య పోరు పెట్టసాగింది. పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను వదిలి వేరు కాపురం పెట్టేందుకు రవిచంద్రకు ఇష్టం లేదు. అలాగని ప్రేమగా చూసుకునే భార్య మాటను కాదనలేక లోలోపల సతమతమవుతూ నిద్రలేని రాత్రిళ్లు గడపసాగాడు. ఈ క్రమంలో అతనికి యాంగ్జైటీ, డిప్రెషన్ చుట్టుముట్టాయి. చికిత్స నిమిత్తం వైద్యుని వద్దకు అతన్ని కుటుంబసభ్యులు తీసుకెళ్లారు. అతని గురించి తెలుసుకున్న డాక్టర్ కుటుంబసభ్యులందరినీ పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. అలాగే రవిచంద్రకు కొన్ని మందులు సూచించి పంపించాడు.
కర్నూలు నగరంలోని గణేష్నగర్కు చెందిన శివకృష్ణ ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. అతను చేస్తున్న ఉద్యోగంలో ఇస్తున్న లక్ష్యాలు చేరుకోవడానికి అతను నిత్యం శ్రమించేవాడు. లక్ష్యాలను చేరుకునే క్రమంలో అతను తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నాడు. అది కాస్తా పానిక్ అటాక్గా మారడంతో కుటుంబసభ్యులు వైద్యుల వద్దకు తీసుకెళ్లారు. పని ఒత్తిడి అన్ని చోట్లా ఉంటుందని, ప్రణాళికతో పని చేసుకుంటే ఏ పనైనా సులభమవుతుందని డాక్టర్ కౌన్సెలింగ్ చేసి పంపించాడు.
మానసిక ఒత్తిళ్లతో బాధపడే వారి సంఖ్య బాగా పెరుగుతోంది. ఒకప్పుడు ఆధునిక జీవితం లేదు. ఖర్చులు తక్కువగా ఉన్నా ఇంట్లో ఒకరు సంపాదించినా కుటుంబమంతా హాయిగా జీవించేది. కానీ ఇప్పుడు ఇంట్లో అందరూ సంపాదించినా ఖర్చులకు సరిపోక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఇప్పుడంతా ఆధునిక సమాజం. పక్కవారిని చూసి ఆధునికతను అందుకోవడానికి ప్రతి ఒక్కరూ ఆశపడుతున్నారు. పక్కవారితో పోల్చుకోవడంతో దానిని అందుకోలేక ఒత్తిడికి గురవుతున్నారు.
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని మానసిక వ్యాధుల విభాగం ఓపీ చికిత్సకు ప్రతి రోజూ 100 నుంచి 120 మంది దాకా వివిధ మానసిక వ్యాధులతో బాధపడే వారు వస్తున్నారు. అందులో 40 శాతం కొత్తవారు ఉంటున్నారు. చికిత్సకు వచ్చిన వారిలో అధిక శాతం బైపోలార్ డిజార్డర్, స్కిజోఫ్రీనియా, డిప్రెషన్, యాంగ్జైటీ, ఆత్మహత్యాయత్నం చేసుకోవాలనుకునేవారు ఉంటున్నారు. పరిస్థితి తీవ్రతను బట్టి ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకుని చికిత్స చేసి పంపిస్తున్నారు. ఈ సమయంలో రోగితో మసలుకోవాల్సిన తీరు గురించి కుటుంబసభ్యులకూ కౌన్సెలింగ్ ఇస్తున్నారు. జిల్లాలో ప్రైవేటు రంగంలోనూ 25 మంది దాకా మానసిక వైద్యులు ఉన్నారు. వీరి వద్దకు ప్రతిరోజూ 150 నుంచి 200 మంది దాకా చికిత్స కోసం వెళ్తున్నారు. వీరే గాక జనరల్ ఫిజీషియన్లు, కార్డియాలజిస్టులు, న్యూరాలజిస్టుల వద్దకు వెళ్లే వారిలోనూ 20 శాతం మంది మానసిక సమస్యలతో బాధపడేవారు ఉంటున్నారు. చికిత్సకు వెళ్లేవారిలో 30 శాతం మంది వృద్ధులు, 5 శాతం మంది పిల్లలు ఉండగా మిగిలిన వారిలో యువత, మధ్యవయస్సు వారు ఉంటున్నట్లు వైద్యులు వెల్లడించారు.
నిద్ర పట్టక..నిద్ర సరిపోక!
పలు రకాల కారణాలతో మానవుని శరీరం తీవ్ర ఒత్తిడికి గురవుతోంది. ఫలితంగా మెదడులో కలిగే పలు రసాయన చర్యల ఫలితంగా పలు వ్యాధులకు ఆహ్వానం లభిస్తోంది. ఇందులో బీపీ, షుగర్, గుండెజబ్బులు, థైరాయిడ్ ప్రధానమైనవి. ముఖ్యంగా హార్మోన్ల అసమతుల్యత కారణంగా వచ్చే షుగర్, థైరాయిడ్ సమస్యలున్న వారి శరీరం తీవ్ర ఒడిదుడుగులకు లోనవుతూ ఉంటుంది. ఒక సమస్యను తగ్గించుకుంటే మరో సమస్య లేచి కూర్చుంటుంది. ఈ క్రమంలో ఈ రెండు సమస్యలున్న వారు తీవ్రస్థాయిలో మానసిక ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. ఈ క్రమంలో సరైన నిద్రపట్టక, నిద్రసరిపోక, వ్యాధులు నియంత్రణలోకి రాక ఇబ్బందులు పడేవారి సంఖ్య ఇటీవల పెరిగిపోయింది. ఈ సమస్యలకు మూలం శారీరక శ్రమ లేకపోవడం, నియంత్రణలేని ఆహారం, ఎక్కువసేపు టీవీ, మొబైల్, కంప్యూటర్ స్క్రీన్లను చూడటమేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
మానసిక రోగుల సంఖ్య పెరుగుతోంది
గతంతో పోలిస్తే ప్రస్తుతం మానసిక జబ్బులతో బాధపడే వారి సంఖ్య బాగా పెరిగింది. వివిధ రకాల కారణాలతో మానసిక సమస్యలు అధికం కావడంతో పాటు ఆసుపత్రిలో మానసిక సమస్యలకు చికిత్స తీసుకుంటే ఫలితం ఉంటుందన్న అవగాహన ప్రజల్లో పెరిగింది. ఈ కారణంగా మానసిక పరివర్తనలో ఏ చిన్న తేడా కనిపించినా వెంటనే వైద్యుల వద్దకు తీసుకొస్తున్నారు. ముఖ్యంగా ఆల్కహాలు, మత్తు పదార్థాలకు అడిక్షన్ అయిన వారు, బెట్టింగ్లకు బానిసైన వారు తమ వద్దకు ఎక్కువగా వస్తున్నారు. అన్ని రకాల మానసిక సమస్యలకు ఇక్కడ చికిత్స అందిస్తున్నాం.
–డాక్టర్ ఎన్.నాగేశ్వరరావు, హెచ్ఓడీ, మానసిక జబ్బుల విభాగం, జీజీహెచ్, కర్నూలు
యువత..పెడదోవ
ఇటీవల కాలంలో యువతలో మానసిక సమస్యలు ఎక్కువైనట్లు వైద్యులు గుర్తించారు. ముఖ్యంగా ఎక్కువ మంది గాంబ్లింగ్, బెట్టింగ్, మొబైల్ నెట్ అడిక్షన్తో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. ముఖ్యంగా యువతలో మొబైల్ గేమింగ్ దురలవాటు ఎక్కువైనట్లు వైద్యులు చెబుతున్నారు. వీరిలో సొమటోఫామ్ డిజార్డర్ వేధిస్తున్నట్లు వారు గుర్తించారు. వివిధ రకాల ఆన్లైన్ బెట్టింగ్లలో డబ్బు పోగొట్టుకుని, దానివల్ల అప్పులు చేసి, వాటిని తీర్చలేక తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ క్రమంలో కొందరు మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు.


